రాయచూరు రూరల్: జిల్లాలో నదులు, వాగుల కింద నీటి ఎద్దడి అధికమైంది. ప్రజలు తాగునీటి కోసం చాలా కష్టాలను అనుభవిస్తున్నారు. మాన్వి తాలూకాలో పోత్నాళ వాగు పూర్తిగా ఎండింది. ఈ నేపథ్యంలో ఎడమ వైపు 35 గ్రామాలు, కుడివైపు 25 గ్రామాల ప్రజలు పోత్నాళ వాగుపై ఆధార పడ్డారు. నేడు వర్షాభావంతో తాగునీటి ఎద్దడి తలెత్తి గ్రామాల్లో హాహాకారాలు ప్రారంభమయ్యాయి. తాగునీటి కోసం ప్రజలు చెలిమ గుంతలు తవ్వుతున్నారు. తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాలైన పోత్నాళ, నందిహాళ, దడేసూగూరు, హిరేహళ్లి, జాగీర్ పన్నూరు, రాయచూరు తాలూకాలోని అరోలి, తిమ్మాపూర్ తదితర 45కు పైగా గ్రామాల్లో తాగునీటి సమస్యలు అధికమయ్యాయి. ప్రజలు తోపుడుబండ్లపై నీటిని తేవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గంటల తరబడి వేచి ఉన్నా నాలుగు బిందెల నీరు దొరకడం కష్టసాధ్యమని ప్రజలు వాపోతున్నారు. కృష్ణా నదిలో కూడా నీరు ఇంకిపోయాయి.
జిల్లాలో అధికమైన నీటి ఎద్దడి
వర్షాభావంతో సమస్య జటిలం


