బళ్లారిటౌన్: జిల్లాలోని ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా వర్నింగ్ జర్నలిస్టు సంఘం జిల్లాధికారికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల పెరుగుతున్న ఫీజులతో తమ పిల్లలకు ఉత్తమ విద్యను అందించలేని సంక్లిష్ట స్థితిలో విలేకరులు ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎక్కువగా పార్ట్టైమ్ విలేకరులే ఉన్నందున ఫీజుల భారాన్ని భరించలేక పోతున్నారని సంఘం జిల్లా అధ్యక్షుడు వీరభద్రగౌడ తదితరులు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని నాలుగో స్తంభం పత్రికా రంగం అని, ఇందులో పని చేసే విలేకరుల పిల్లలకు కూడా ఉన్నత స్థాయి విద్య కల్పించుకోవాలని ఆశ ఉంటుందన్నారు. సమాజం కోసం కష్టపడుతున్న విలేకరులకు తమ పిల్లలకు ఉత్తమ విద్యను కల్పించే దిశలో ఆయా విద్యా సంస్థల్లో రాయితీ కల్పించాలని విన్నవించారు. అనంతరం జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారిస్ సుమేరా, విద్యాశాఖ అధికారికి వినతిపత్రాలను అందజేశారు. ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, పదాధికారులు బసవరాజు, గురుశాంత్, హరీష్, నాగరాజు, వినాయక, శ్రీనివాస్ శెట్టి, నందీష్, జంబునాథ్, వెంకోబి, తిమ్మప్ప చౌదరి, మంజునాథ తదితరులు పాల్గొన్నారు.


