రాయచూరు రూరల్: నగరంలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అరుణాంగ్శు గిరి వెల్లడించారు. రాయచూరు తాలుకా కోర్తుకుందలో నీలమ్మ, మామిడి దొడ్డిలో వెంకటేషను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. నిందితుల నుంచి కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగించిన సీహెచ్్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అలాగే 67 లీటర్ల కల్తీ కల్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యాపలదిన్ని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
సమయానికి
బస్సులు నడపాలి
హొసపేటె: నగరంలోని కేంద్ర బస్టాండ్ నుంచి సండూరు పట్టణానికి వెళ్లే బస్సులు సమయానికి బయలుదేరక పోవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి హోస్పేట పట్టణం నుంచి సండూరు వెళ్లే ప్రయాణికులు నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో ప్రయాణికులు ఉన్నప్పటికీ బస్సులు సమయానికి బయలుదేరక పోవడంతో కేకేఆర్టీసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రయాణికులు, రవాణా సంస్థ సిబ్బందికి మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం చివరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. సండూరు మార్గంలో నడిచే బస్సులు సమయానికి బయలుదేరక పోవడంతో మహిళలు, పిల్లలు సహా ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సండూరు బస్టాండ్ స్థానాన్ని మార్చడంపై కూడా ప్రయాణికులు మండిపడ్డారు.
నమో నారసింహా..
రాయచూరు రూరల్: నగరంలో లక్ష్మీ నరసింహ స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పూర్ణిమ కావడంతో కోటలో వెలసిన లక్ష్మీ నరసింహ ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గురువారం సాయంత్రం ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
ధరలు తగ్గించాలి
రాయచూరు రూరల్: పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించి, నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీసీఐఎంల్ డిమాండ్ చేసింది. శుక్రవారం గాంధీ సర్కిల్ వద్ద నాయకులు ఆందోళన చేపట్టారు. సీసీఐఎంల్ కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ.. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేశారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తోందని పేర్కొన్నారు. నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ పాదయాత్ర చేశారు.
సీఐపై సస్పెన్షన్ వేటు
● విద్యార్థి ఆత్మహత్య కేసు
హుబ్లీ: ధార్వాడ జిల్లా గిరినగరలో ఓ విద్యార్థి ఆత్మహత్య కేసులో విద్యాగిరి పోలీస్ స్టేషన్ సీఐ మహమ్మద్ రఫిక్పై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు.. గంజాయి రహిత అభియాన నేపథ్యంలో పోలీసులు ఆదిత్య మ్యాగేరి అనే డిగ్రీ విద్యార్థిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు జరపగా ఆ విద్యార్థి గంజాయి సేవించలేదని నిర్ధారణ అయ్యింది. అయితే రూ.2000 లంచం ఇవ్వకుంటే వేరే కేసులో ఇరికిస్తామని బెదిరించారు. మనస్తాపం చెందిన ఆదిత్య మ్యాగేరి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో బుధవారం ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. తాజాగా సీఐపై కూడా వేటు పడింది. విధి నిర్వహణలో లోపం కారణంగా సీఐపై చర్యలు తీసుకున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ వెల్లడించారు. ఘటనలో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీతో బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తే సరిపోదని.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఆ మేరకే సీఐను కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


