కెలమంగలం: తళిలో వెలసిన చారిత్రక ప్రసిద్ది పొందిన రుక్మిణి, సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మ రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అవనంతరం రుక్మిణి, సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవమూర్తిని రథంపై కొలువుదీర్చి ఊరేగించారు. తళి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు, ఆనేకల్, చందాపుర, కనకపుర తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రథోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చారు. రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. వేణుగోపాల స్వామి నామస్మరణ మార్మోగింది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మజ్జిగ, పానకం, చల్లని పానీయాలు అందజేశారు. వివిధ స్వచ్ఛంధ సంస్థలు, స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.


