రాయచూరు రూరల్: నేటి తరం యువకులు మత్తు పదార్థాలకు బానిసలు కారాదని జిల్లా అధికారి నితీష్ సూచించారు. గురువారం రాయచూరు వైద్య కళాశాల పరిశోధన సంస్థలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం, సీహెచ్ పౌడర్ గంజాయి, హపీం వంటి వాటికి యువత దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మత్తుకు బానిస అయితే భవిష్యత్తు అంధకారం అవుతుందని తెలిపారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా మద్య తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించి వాటి నియంత్రణకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అరుణాంగ్శు గిరి, అదనపు ఎస్పీ కుమార స్వామి, హరీష్, రిమ్స్ అధికారులు రమేష్, ఉదయ్, విజయ శంకర్, బసవరాజ్ పాటిల్, డీఎస్పీ శాంతవీర, సీఐ మేకా నాగరాజ్, ఎస్ఐలు బసవరాజ్, మహ్మద్ ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
ఉడుసలమ్మ
ఆలయ ప్రారంభోత్సవం
బళ్లారి అర్బన్: కంప్లి నియోజకవర్గ పరిధిలోని బాదనహట్టిలో పునర్నిర్మాణం చేసిన ఉడుసలమ్మ దేవి ఆలయ ప్రారంభోత్సవం, గోపుర కలశ ప్రతిష్ణ వైభవంగా జరిగింది. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబంపై ఉడుసలమ్మ దేవి ఆశీస్సులు, బాదనహట్టి ప్రజల ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే భరత్రెడ్డి, వ్యాపార వేత్త సతీష్ రెడ్డిని గ్రామ పెద్దలు అభినందించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ ఎం.రాజేశ్వరి, కాంగ్రెస్ నాయకులు సుబ్బరాయుడు, చానాళ్శేఖర్, వ్యాపార వేత్త సతీష్ రెడ్డి, గ్రామస్తులు మేటి బసప్ప, హనుమంత రెడ్డి తిమ్మప్ప, గోవిందప్ప, బసప్పయ్య, మనూరు జడెప్ప, కరెన్న, హెచ్.ఈశ్వర గౌడ, పరశురాం తదితరులు పాల్గొన్నారు.
భానుడి భగభగలు
రాయచూరు రూరల్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 10 గంటలు దాటితే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు చల్లని పానీయాలు సేవిస్తున్నారు. రాయచూరులో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని జిల్లా అధికారి నీతిష్ తెలిపారు. యాదగిరిలో44.5, కలబుర్గిలో 43.5, బాగల్ కోటలో 43.5, బీదర్లో 44.4, విజయపురలో 43, బెళగావి, కొప్పళ్, గదగ్లో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
సర్కారు ఆస్పత్రిలో
ఐఏఎస్ భార్యకు కాన్పు
రాయచూరు రూరల్: నగరంలోని తల్లీబిడ్డల ఆస్పత్రిలో గురువారం ఐఏఎస్ భార్యకు కాన్పు చేశారు. జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఈశ్వర్ కుమార్ కాందూ భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఈశ్వర్ కుమార్ కాందూ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని మౌలిక సౌలభ్యాలు కల్పించడం జరిగిందన్నారు. పేదలు వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో కాన్పు చేయించొద్దన్నారు. పేదలు అప్పులు చేసి బాధ పడకుండా సర్కారీ సౌలభ్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
14 కేంద్రాల్లో నీట్ పరీక్ష
బళ్లారి రూరల్: ఈనెల 3వ తేదీ జరగనున్న నీట్ పరీక్షకు దావణగెరెలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అధికారి జి.ఎం.గంగాధర స్వామి తెలిపారు. గురువారం జిల్లా అధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటు చేసిన నీట్ ముందస్తు సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నీట్ పరీక్షకు దావణగెరెలో 13, హరహరలో 1 చొప్పున మొత్తం 14 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. మొత్తం 7,280 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేసినట్లు తెలిపారు. జిరాక్స్, కంప్యూటర్ సెంటర్లను బంద్ చేస్తామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు, మొబైల్, క్యాలికులేటర్, బ్లూటూత్, తదితర ఎలాక్ట్రానిక్ వస్తువులు తీసుకుని రాకూడదని పేర్కొన్నారు.


