సాక్షి బళ్లారి: గంగావతి బీజేపీ యువమోర్చా నాయకుడు కురుబ వెంకటేష్ హత్య కేసులో గంగావతి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరుగురికి ఉరిశిక్ష విధించగా.. మరో ఆరుగురిని నిర్ధోషులుగా తేల్చింది. 2025 అక్టోబర్లో కురుబ వెంకటేష్ స్నేహితుడితో కలిసి వెళ్తుండగా పాత కక్షలతో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన కొన్ని గంటల్లోనే రవి, అల్తాఫ్ బళ్లారి, గంగాధర్, దాదాపీర్, మైలారీ విజయ్, సలీమ్తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. చార్జిషీట్ దాఖలు చేసి కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు పూర్తి దర్యాప్తు చేసి కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. న్యాయమూర్తి సదానందప్ప వాదోపవాదనలు, సాక్ష్యాధారాలు పరిశీలించారు. కురుబ వెంకటేష్ హత్య కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురికి మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన రవి, అల్తాఫ్, గంగాధర్, దాదాపీర్, మైలారీ, సలీమ్కు ఉరిశిక్ష విధించగా.. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఇదే కేసులో అరెస్టు అయిన కార్తీక్, భీంభరత్, ధనరాజ్, శరణబసవ, మల్లికార్జున్ తదితరులను నిర్ధోషులుగా ప్రకటించారు. వెంటనే వీరిని విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మరో ఆరుగురిని నిర్ధోషులుగా తేల్చిన కోర్టు


