హొసపేటె: దివ్యాంగులు సమాజంలో ప్రధాన స్రవంతిలోకి ప్రవేశించడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, అధికారులు వారి సమస్యలపై ఆలస్యం చేయకుండా తక్షణమే స్పందించాలని జిల్లాధికారిణి కవిత ఎస్.మన్నికేరి అన్నారు. మంగళవారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో దివ్యాంగుల సమస్యలపై జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు నెలవారీ భత్యాలు, పరికరాలు, బస్పాస్ల పంపిణీలో ఎలాంటి లోపం జరగకుండా చూడాలన్నారు.
ఖాళీ పోస్టుల భర్తీకి సూచన
అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకించిన పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు కట్టుదిట్టమైన సూచనలు ఇచ్చారు. సమావేశానికి హాజరైన వందలాది మంది దివ్యాంగులు, వివిధ శాఖల నుంచి తమకు అవసరమైన సౌకర్యాలు, పరికరాలు సకాలంలో అందడం లేదని తెలిపారు. దీని వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ప్రాజెక్టుల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వారు జిల్లాధికారిణికి వినతిపత్రం సమర్పించారు. కాగా ఈ విషయాన్ని పరిశీలించి, అవసరమైన చర్యలు చేపడతామని జిల్లాధికారిణి సానుకూలంగా స్పందించారు. జిల్లా వికలాంగుల సంక్షేమ అధికారి, మహిళా శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గంగప్ప, పట్టణాభివృద్ధి శాఖ ప్లానింగ్ డైరెక్టర్ మనోహర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా, తాలూకా స్థాయి అధికారులు హాజరయ్యారు.


