బనశంకరి: బెంగళూరులో 16 మంది డ్రగ్స్ విక్రేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.36.67 కోట్ల విలువచేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన నగర పోలీసు కమిషనరేట్లో డ్రగ్స్ను పరిశీలించి మాట్లాడారు. బాగలూరు, ఆడుగోడి, చిక్కజాల, హెచ్ఎస్ఆర్.లేఔట్, యశవంతపుర, జాలహళ్లి, జ్ఞానభారతి ఠాణాల పరిధిలో డ్రగ్స్ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న 16 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరిలో నలుగురు విదేశీయులు, 8 మంది బయటి రాష్ట్రాలవారు ఉన్నారు. వీరికి జాతీయ, అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
ఏమేం దొరికాయి..
9 కేజీల ఎండీఎంఏ, 5 కేజీల హైడ్రో గంజాయి, 19,755 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 156 గ్రాముల హెరాయిన్, 618 గ్రాముల చరస్, 332 గ్రాముల కొకై న్, 315 గ్రాముల గమ్మిస్ మిశ్రమం, 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలో కాలేజీ విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులకు విక్రయిస్తుండడం గమనార్హం. మత్తు పదార్థాల గురించి తెలిస్తే ప్రజలు 1922 లేదా 112 నంబర్లుకు సమాచారం అందించాలని తెలిపారు.
వారం రోజుల్లో రూ.50 కోట్ల డ్రగ్స్ సీజ్
ఈ వారం రోజుల్లో నగర పోలీసులు రూ.50 కోట్ల విలువచేసే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఒక్కరోజైనా డ్రగ్స్ దొరకని రీతిలో పోలీసులు పనిచేయాలని హోంమంత్రి అన్నారు. డ్రగ్స్తో అమాయకులు బలి అవుతున్నారు, వాటి నిర్మూలనే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాలలు, కాలేజీలకు పోలీసులు వెళ్లి విద్యార్థులను జాగృతం చేస్తున్నారని తెలిపారు. కమిషనర్ సీమంత్కుమార్ సింగ్, పాల్గొన్నారు.
ఇద్దరు నైజీరియన్ల అరెస్టు
కృష్ణరాజపురం: ఆడుగోడి పోలీసులు, జాలహళ్లి పోలీసులు కార్యాచరణ జరిపి ఇద్దరు నైజీరియన్లను అరెస్టు చేసి కోట్లాది రూపాయల మత్తు పదార్థాలను పట్టుకున్నారు. నగరంలో విదేశీ పోస్టాఫీసుకు పార్శిళ్ల ద్వారా హైడ్రో గంజాయి, గమ్మిస్ అనే మత్తు పదార్థాలను తెప్పించేవారు. పార్సిళ్లు ఏ దేశం నుంచి వచ్చాయో దర్యాప్తు చేస్తున్నారు.
పట్టుబడిన నైజీరియన్లు
16 మంది విక్రేతల అరెస్టు


