సాక్షి బళ్లారి: దేశ ప్రధానిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(ఏఐసీసీ) మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బళ్లారిలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. మంగళవారం జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఖండిస్తూ ర్యాలీ చేసి డీసీసీ కార్యాలయం ముట్టడించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉగ్రవాది(టెర్రరిస్టు) అని సంబోధించిన ఖర్గే తన వక్రబుద్ధిని ప్రదర్శించారని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెంటనే క్షమాపణలు చెప్పాలని, లేకపోతే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లిస్తుందని హెచ్చరించారు.
గాంధీ కుటుంబం మెప్పు కోసమే..
ఒక కుటుంబం మెప్పు కోసం ఖర్గే ప్రధాని మోదీపై దురహంకార వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ప్రజాసామ్య విలువలకు విరుద్ధమన్నారు. దేశంలోనే ఉగ్రవాదాన్ని అరికట్టడంలో కీలక భూమిక పోషించిన ప్రధాని మోదీని ఉగ్రవాదిగా పేర్కొనడంలో అర్థం లేదన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరి హయాంలోనో అందరికీ తెలుసన్నారు. ప్రధాని మోదీ దేశంలోనే అప్రతిమ దేశభక్తుడన్నారు. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానాయకుడని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం, దేశభక్తిని వ్యతిరేకించే వారి మెప్పు పొందాలనుకుంటే ఆ పార్టీ మరింత పతనానికి దారి తీస్తుందన్నారు. ఎమ్మెల్సీ వైఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ నాయుడు, నగర బీజేపీ అధ్యక్షుడు వెంకటరమణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పాలని డిమాండ్
డీసీసీ కార్యాలయం ముట్టడి


