హొసపేటె: అతి వేగంగా వెళుతున్న లారీ అదుపు తప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద సోమవారం జరిగింది. బెంగళూరు నుంచి కొప్పళ వైపునకు వెళుతున్న లారీ మార్గమధ్యంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో లారీ బోల్తా పడింది. లారీ ఢీకొన్న తీవ్రతకు హై టెన్షన్ విద్యుత్ స్తంభం కూడా విరిగి రహదారి మీద పడటంతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మునిరాబాద్ పోలీసులు చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ఘటనపై మునిరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.


