రాయచూరు రూరల్: నేటి సమాజంలో విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని జిల్లాధికారి నితీష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయంలో పదో తరగతిలో ర్యాంక్లు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడారు. క్రమశిక్షణకు ప్రతి రూపమన్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో ప్రావీణ్యతను సంపాదించుకోవాలన్నారు. విద్యార్థులు నిరంతరం అధ్యయనశీలురు కావాలన్నారు. విద్యార్థులకు శత్రువులు టీవీ, మొబైళ్లు అని, వాటికి దూరంగా ఉండాలని కోరారు.
ఉపాధ్యాయుల కృషి అమోఘం
జిల్లాను 21వ స్థానంలో నిలబెట్టడానికి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులు, నోడల్ అధికారులు చేసిన కృషిని శ్లాఘించారు. ఆరుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి జిల్లాకు, తల్లిదండ్రులకు పేరు తెచ్చారన్నారు. ఉపాధ్యాయుల కొరత మధ్య కూడా ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఆరుగురు విద్యార్థులకు పారితోషికంగా రూ.10 వేల చెక్లను అందించారు. సమావేశంలో అదనపు జిల్లాధికారి శివానంద, జెడ్పీ సీఈఓ విజయ్ శంకర్, విద్యాశాఖాధికారి బడిగేర, సురేష్ వర్మ, చంద్రశేఖర్, ఈరణ్ణలున్నారు.


