కెలమంగలం: బాబాయితో కలిసి చెరువులో చేపలు పట్టేందుకెళ్లిన పదేళ్ల బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన ఘటన కెలమంగలం పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. వివరాల మేరకు.. కెలమంగలం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన బాల కుమారుడు కిషోర్ (10). శనివారం సాయంత్రం బాబాయి గోవిందరాజ్తో కలిసి జెక్కేరి సమీపంలోని దూల్శెట్టి చెరువులో చేపలు పట్టేందుకెళ్లాడు. ఈ సమయంలో బాలుడు లోతైన ప్రదేశానికి వెళ్లడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కెలమంగలం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
తామర పువ్వు కోసేందుకు వెళ్లి మహిళ..
కెలమంగలం: తామర పువ్వు తీసేందుకు చెరువులోకి దిగిన మృతి చెందింది. ఈ ఘటన డెంకణీకోట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. డెంకణీకోట సమీపంలోని మారేగౌనిపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ మురుగేష్ భార్య కవిత (21). వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. శనివారం ఉదయం కవిత పశువులను మేత కోసం చెరువు వద్దకు తీసుకెళ్లింది. ఈ సమయంలో చెరువులో అందంగా కనిపిస్తున్న తామర పువ్వును తీసేందుకు నీటిలో దిగింది. లోతైన ప్రదేశానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందింది. గమనించిన స్థానికులు చెరువులో గాలించి కవిత మృతదేహాన్ని బయటకు తీశారు. డెంకణీకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.


