బళ్లారి అర్బన్: సండూర్ తాలూకా తాలూరు గ్రామంలో కార్మిక శాఖ మంత్రి సంతోష్లాడ్ ఆధ్వర్యంలో అంకిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులకు స్మార్ట్ కార్డులు, హక్కుల ధృవపత్రాలు పంపిణీ చేశారు. రోడ్డు, మురుగునీటి పారుదల, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులను ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే అన్నపూర్ణ సాథ్ ప్రారంభించారు. మంత్రి సంతోష్లాడ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గిగ్ వర్కర్లు, సినిమా, గృహ కార్మికులకు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. కార్మికులకు కనీస వేతన బిల్లును మరో వారంలో ఖరారు చేస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ అంశాలపై మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, అప్పులు పెరిగాయని ఆరోపించారు. ఎంపీ తుకారాం మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. తుంగభద్ర జలాశయం నీటిని తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు.


