మైసూరు: రాష్ట్రంలోని దావణగెరె దక్షిణ, బాగల్కోటె అసెంబ్లీ క్షేత్రాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో మేమే గెలుస్తాం. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా విజయం మాదే అని సీఎం సిద్దరామయ్య అన్నారు. శనివారం మైసూరులోని మండకల్లి విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. దావణగెరెలో ఎలాంటి గందరగోళం లేదన్నారు. ఆ ఫలితాలను దిక్సూచి అని, ఇంకేదో అని చెప్పనన్నారు. తాను ఏప్రిల్ 1 నుంచి ప్రచారంలో పాల్గొంటానని, ఏప్రిల్ 5న కేరళ ఎన్నికల ప్రచారానికి వెళ్తానని తెలిపారు. తమిళనాడులో ప్రచారానికి వెళ్లనన్నారు.
ద్విభాషా విద్యా విధానమే
త్రిభాషా విధానానికి బదులు రాష్ట్ర విద్యారంగంలో ద్విభాషా విధానాన్ని అమలు చేయడానికి పట్టుదలతో ఉన్నానని సీఎం తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలని ఆయన అన్నారు. తాను బాల్యంలో హిందీ ఎప్పుడూ చదవలేదు. నాపై హిందీని బలవంతం చేయకూడదని అన్నారు. ఎమ్మెల్యేలు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ రెండు టికెట్లు కావాలని అడిగారు, అందులో తప్పేం లేదన్నారు. మ్యాచ్లు చూడడమంటే తనకూ ఇష్టమని చెప్పారు. మైసూరు జిల్లాలో డ్రగ్స్ నెట్వర్క్ గురించి పోలీసు అధికారుల నుంచి ఇప్పుడే సమాచారం అందిందన్నారు. కర్ణాటకను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు తాము పోరాడుతున్నామని చెప్పారు. మంత్రి డా. హెచ్.సి. మహాదేవప్ప, ఎమ్మెల్యే కె. హరీష్ గౌడ, అధికారులు పాల్గొన్నారు.
1 నుంచి ప్రచారానికి: సీఎం సిద్దు


