సాక్షి బళ్లారి: హిందువుల ముఖ్య పండుగల్లో ఒక్కటైనా శ్రీరామనవమి రోజున కర్ణాటకలో ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం యథావిధిగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు పని చేశాయి. శ్రీరామనవమి అనేది శ్రీరాముని జన్మదినంగా భావించే పవిత్రమైన రోజు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రామాయణ పారాయణం, శ్రీసీతారాముల కళ్యాణోత్సవం, ఊరేగింపులు, అన్నదానాలు జరుగుతాయి. కర్ణాటకలో ఈ పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. కర్ణాటక ప్రభుత్వం అధికారిక సెలవు జాబితాలో పలు జాతీయ, ప్రాంతీయ, మత పరమైన పండుగలకు సెలవులు ఇచ్చింది. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామనవమి రోజున సెలవు ప్రకటించకపోవడంతో ప్రజలు మండిపడుతున్నారు.
పవర్ లిఫ్టింగ్లో పతకాల పంట
కోలారు: బెంగుళూరు ఉత్తర విశ్వ వర్సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో బంగారుపేటలో నిర్వహించిన 57 కిలోల పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారుపేటలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థిని మానస తృతీయ బహుమతి సాధించింది. ప్రథమ బీఏ విద్యార్థిని గౌరమ్మ 69 కిలోల విభాగంలో తృతీయ స్థానం, ప్రథమ బీఎస్పీ అంబికా 84 కిలోల విభాగంలో ద్వితీయ బహుమానం సాధించారు. సాధక విద్యార్థినులను ప్రిన్సిపాల్ శ్రీనివాసగౌడ, దైహిక శిక్షణ డైరెక్టర్ సుబ్రమణి, క్రీడా సమితి సభ్యులు అభినందించారు.


