బనశంకరి: బెంగళూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పండించే కూరగాయల్లో సీసీం అనే ప్రమాదకర భారీ లోహంతో కూడిన అంశాలు, క్రీమినాశక అంశాల అవశేషాలు వెలుగుచూశాయి. వీటిని భుజిస్తే కిడ్నీ, మెదడు సంబంధిత రోగాలు వస్తాయనే దిగ్భ్రాంతికర అంశం వెలుగులోకి వచ్చింది. బెంగళూరు నగర మార్కెట్లలో కూరగాయలను పరిశీలించిన సమయంలో భారీ ప్రమాణంలో విషకారక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) కమిటీ పరీక్ష నిర్వహించి ధృవీకరించింది. ఇందులో 72 తరహాలో 19 విషకార అంశాలు కనబడ్డాయి. వంకాయలు, సొరకాయలు, అనపకాయలు, దొండకాయలు తదితర వివిధ రకాల ఆకుకూరల్లో సీసం అంశం ఉన్నట్లు తెలిసింది. పరిసర నిర్వహణ పరిశోధన సంస్థ(ఈఎంపీఆర్ఐ) కూరగాయల్లో భారీలోహాలు ఉండటంపై రెండేళ్ల క్రితం హెచ్చరించింది. ప్రస్తుతం అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రాధికార కమిటీ నిర్వహించిన పరిశీలనలో కూరగాయల్లో ప్రమాదకర సీసం(లెడ్)తో కూడిన నిషేధిత కీటక నాశక అంశాలు ఉన్నట్లు కనబడింది. దీనిపై 2023లో మీడియాలో ప్రకటించిన నివేదిక ఆధారంగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) సుమోటో కేసు నమోదు చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించడానికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ఐదు మంది సభ్యులతో కూడిన కమిటీ ఎఫ్ఎస్ఎస్ఏఐ గుర్తింపు పొందిన లాబొరేటరీల ద్వారా పరీక్షలు చేపట్టింది.
ఎక్కడెక్కడ శాంపిల్స్ సేకరణ?
బెంగళూరు నగరంలోని నెలమంగల, రాజాజీనగర, కోలారు, చిక్కబళ్లాపుర మార్కెట్లు, వ్యవసాయ భూముల నుంచి మొత్తం 72 కూరగాయల శాంపిల్స్ సేకరించింది. ల్యాబొరేటరీ పరీక్షల్లో 72 శాంపిల్స్ పైకి 19లో నిర్ణయించిన దానికంటే అధిక ప్రమాణంలో సీసం వెలుగు చూసింది.
మట్టి కూడా కలుషితం
కూరగాయలు మాత్రమే కాకుండా కోలారు, చిక్కబళ్లాపుర, నెలమంగలలో 13 చోట్ల సేకరించిన 26 మట్టి శాంపిల్స్కు గాను 23 శాంపిల్స్ కలుషితమైనట్లు ల్యాబ్ పరీక్షల్లో వెలుగుచూసింది.
నిషేధిత కీటకనాశకాల ఆచూకీ లభ్యం
ఆహార సురక్షత, నాణ్యత నిబంధనలు(ఎఫ్ఎస్ఎస్ఆర్) పరిమితిని దాటి 12 రకాల కీటకనాశకాల అవశేషాలు కూరగాయల్లో లభ్యమయ్యాయి.
లావైన వంకాయలు, అల్లం, కీరదోసకాయలు, బజ్జీ మిరపకాయల్లో అత్యధిక కీటకనాశకాలు కనబడ్డాయి.
భారత్లో 2023లో నిషేధిత విషకార మోనోక్రోటోపాస్ కీటక నాశకాలు బజ్జీమిరపకాయల్లో నిర్ణయించిన దానికంటే రెండు రెట్లు అధికంగా ఉంది.
యూరోపియన్ యూనియన్లో విషకారి అని నిషేధించిన అసిపేట్, ఇదియాన్, పిప్రోనిల్, ప్రోపెనోపాస్ లాంటి రసాయనాలు లభ్యమయ్యాయి.
ఇది కేవలం ప్రారంభ దశ నివేదిక కాగా వ్యవసాయ శాఖ, వ్యవసాయ యూనివర్శిటీల నేతృత్వంలో
స్థానిక స్థాయిలో మరింత సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందని కమిటీ అభిప్రాయపడింది. అంతేగాక రైతుల్లో కీటకనాశకాల వినియోగంపై జాగృతం చేయాలని సిఫార్సు చేసింది.
బెంగళూరు మార్కెట్ల కూరగాయల్లో విషకార అంశాలు వెలుగులోకి
భారీ ప్రమాణంలో సీసం ఆచూకీ లభ్యం, సీపీసీబీ పరీక్షల్లో ధృవీకరణ
కిడ్నీ, మెదడు తదితర అవయవాలు వ్యాధుల బారిన పడే అవకాశం
ఏయే కూరగాయల్లో ఎంతమేర విషం అంటే....
సేంద్రియంగా పండించి విక్రయిస్తున్న వంకాయల్లో 1.953 ఎంజీ/ కేజీ మేర సీసం లభ్యమైంది. ఇది నిర్ణయించిన దాని కంటే 20 రెట్లు అధికంగా ఉంది.
దొండకాయల్లో సుమారు 18 రెట్లు అధికంగా సీసం కనబడింది.
అనపకాయల్లో నిర్ణయించిన దాని కంటే 9 రెట్లు అధికం.
ఆకుకూరలు, క్యాబేజీలో నిర్ణయించిన దాని కంటే 5 రెట్లు సీసం లభ్యమైంది.
కీరదోస, బీరకాయ, బీట్రూట్, కాలీఫ్లవర్, బీన్స్, బజ్జీ మిరపకాయల్లో సీసం అంశాలు అధికంగా ఉన్నాయి.


