బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీరాముని దేవస్థానాలు రామజపంతో మారుమోగాయి. బెంగళూరు నగరంలోని ఇస్కాన్ దేవస్థానం, చామరాజపేటె శ్రీరామేశ్వర దేవస్థానంలో సీతారామ లక్ష్మణుడికి ప్రత్యేక అలంకరణ చేపట్టి విశేష పూజలు నిర్వహించారు. రాజాజీనగర శ్రీరామమందిర, రాగిగుడ్డ అంజనేయ దేవస్థానం, కోటె ఆంజనేయ దేవస్థానం, హనుమంతనగర గుట్టె ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. రాజాజీనగర శ్రీరామ మందిర దేవస్థానంలో భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరి నిలిచారు. మైసూరు రోడ్డు గాలి ఆంజనేయ దేవస్థానం వద్ద భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రామాలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ చేపట్టారు. భక్తులు ఉదయం నుంచి దేవస్థానాలకు వెళ్లి స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. బెంగళూరు నగర వ్యాప్తంగా పలు వీధులు, కూడళ్లలో సీతా, రామ, లక్ష్మణుల చిత్రపటాలను పెట్టి పూజలు చేపట్టిన వివిధ సంఘాలు ప్రజలకు పానకం, మజ్జిగ, ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకలు
ఆలయాల్లో స్వామి వారి దర్శనానికి భక్తుల బారులు


