మండ్య: మండ్య జిల్లా మేలుకోటె పుణ్యక్షేత్రంలో వెలసిన చెలువనారాయణస్వామి ప్రపంచ ప్రసిద్ధ వైరముడి పట్టాభిషేక ఉత్సవానికి ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కుమార్ తెలిపారు. 28న రాత్రి 8గంటలకు ప్రారంభమై తెల్లవారుజామురన 4 గంటల వరకు కొనసాగుతుందన్నారు. మైసూరు రాజులు చేయించిన వజ్రాలు పొదిగిన రాజముడి కిరీటాన్ని ధరింపజేసి ఉత్సవం నిర్వహిస్తారన్నారు. సుమారు రెండు లక్షల మంది భక్తులు, పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రధాన పట్టణాలు, నగరాల నుంచి మేలుకోటకు కేఎస్ ఆర్టీసీ 140 బస్సులను ఏర్పాటు చేసిందన్నారు. మొత్తం 14 చోట్ల వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
కీచక ప్రొఫెసర్ అరెస్ట్
దొడ్డబళ్లాపురం: విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి అసభ్యకరంగా వ్యవహరించిన ప్రొఫెసర్ను నెలమంగల పోలీసులు అరెస్టు చేశారు. హోంమంత్రి జీ పరమేశ్వర్కు చెందిన నెలమంగల తాలూకా టీబేగూరు వద్ద ఉన్న సిద్ధార్థ మెడికల్ కళాశాలలో అబ్దుల్ అనే ప్రొఫెసర్ ఒక విద్యార్థినికి చాక్లెట్ ఇచ్చి స్టేజ్ మీద నిలబడి మైక్లోనే ప్రపోజ్ చేయగా విద్యార్థులు కలిసి చితకబాదిన సంగతి తెలిసిందే. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో కేసు నమోదు చేసుకున్న నెలమంగల పోలీసులు ప్రొఫెసర్ అబ్దుల్ను అరెస్టు చేశారు. భార్యకు దూరంగా ఉంటున్న అబ్దుల్ గతంలోనూ తుమకూరు ఆస్పత్రి, బోరింగ్ ఆస్పత్రుల్లోనూ ఇదేవిధంగా అసభ్యంగా ప్రవర్తించి తన్నులు తిన్నట్టు తెలిసింది.
బనశంకరీదేవికి
విశేష పూజలు
బనశంకరి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బనశంకరీ దేవికి శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ ఆధ్వర్యంలో బనశంకరీదేవి మూలవిరాట్కు ప్రత్యేక అర్చనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం పలు రకాల పండ్లతో విశేష అలంకరణ నిర్వహించి పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు.
అటవీ ప్రాంతంలో కార్చిచ్చు
మైసూరు; చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని బైలూరు జోన్లో బీఆర్టీ టైగర్ రిజర్వ్ ఫారెస్టు గుండిమల, నెల్లికత్రి అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. 80 ఎకరాల్లో భారీ ఎత్తున చెట్లు, చేమలు కాలి బూడిదయ్యాయి. బైలూరు వన్యప్రాణి జోన్కు చెందిన ఆర్ఎఫ్ఓ ప్రమోద్, అతని సిబ్బంది సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అగ్నిమాపక కేంద్ర సిబ్బంది చేరుకొని అటవీ శాఖ సిబ్బందితో కలిసి మంటలను ఆర్పివేశారు.
ముగ్గురు పిల్లలతో కలిసి
తల్లి ఆత్మహత్య
● విజయపుర జిల్లాలో విషాదం
సాక్షి,బళ్లారి: నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లి తన పిల్లల కోసం ఎన్నో కలలు కనింది. వారిని చదివించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశపడింది. కాని జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా మరే ఇతర కారణాలో కాని ఆ తల్లి తన కన్న బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. విజయపుర జిల్లా ఇండి తాలూకా మిరిగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శంక్రప్ప భార్య రాజశ్రీ శంక్రప్ప హళ్లూరు (28) అనే మహిళ ఇద్దరు కుమార్తెలు, కుమారుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. భర్త గ్రామంలో లేనప్పుడు తల్లి రాజశ్రీ పిల్లలతో పాటు ఆత్మహత్యకు ఒడిగట్టింది. విషయం తెలిసిన వెంటనే అక్కడి పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన తల్లి, పిల్లల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ఆస్పత్రికి తరలించారు.


