గుత్తి రూరల్: మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో జాతీయ రహదారి–67పై గురువారం తెల్లవారు జామున ముందు వెళ్తున్న టిప్పర్ను వెనుక నుంచి ఐచర్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో క్లీనర్ అభిజిత్(23) మృతి చెందగా, డ్రైవర్ అక్షయ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు వివరాలు... కర్ణాటకలోని హొసపేటెకు చెందిన డ్రైవర్ అక్షయ్, విజయపుర జిల్లా తికోటా తాలూకా కనమాడి గ్రామానికి చెందిన అభిజిత్ ఐచర్ వాహన డ్రైవర్, క్లీనర్లుగా పని చేసేవారు. ఈ క్రమంలో వారు ఐచర్లో హొసపేటె వైపునకు వెళ్తూ మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్ను గమనించకుండా వెళ్లి వెనుక నుంచి ఢీకొన్నారు. ఎదురుగా వస్తున్న లారీ వెలుతురుతో పాటు ఐచర్ డ్రైవర్ అక్షయ్ నిద్ర మత్తులో కునుకు తీసి నేరుగా వెళ్లి ముందున్న టిప్పర్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో డ్రైవర్ అక్షయ్, క్లీనర్ అభిజిత్ ఐచర్లో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ క్రేన్ను తెప్పించి ఐచర్లో ఇరుక్కున్న ఇద్దరిని బయటకు తీశారు. అయితే క్లీనర్ అభిజిత్ అప్పటికే మృతి చెందగా, డ్రైవర్ అక్షయ్ తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ అక్షయ్ని గుత్తి ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తరలించారు. ముందు వెళ్తున్న టిప్పర్ని ఢీకొని ఐచర్ రోడ్డుకు అడ్డంగా నిలిచి పోవడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎస్ఐ సురేష్ ఐచర్ను పక్కకు తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లీనర్ మృతి, డ్రైవర్కు తీవ్ర గాయాలు


