బనశంకరి: కోర్టుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాదిమంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన స్కాములో మరో నలుగురిని బుధవారం బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. జీఎస్.వెంకటరెడ్డి, తిప్పేస్వామి, సిద్దలింగయ్య, విజయా సిద్దలింగయ్య హిరేమఠ పట్టుబడినవారు. ఇదివరకే జేసన్ డిసౌజా, లవీనా అనే దంపతులను అరెస్టు చేయడం తెలిసిందే. ఈ మోసకారి జంట.. నిరుద్యోగులను గాలించి, డబ్బు వసూలు చేయడానికి పై నిందితులను ఏజెంట్లును నియమించుకున్నారు. నిరుద్యోగులు, ప్రైవేటు కంపెనీల్లో తక్కువ జీతానికి పనిచేసేవారికి ఈ ముఠా మాయమాటలు చెప్పేది. సర్కారీ ఉద్యోగం గ్యారంటీ అని రూ.10 లక్షల నుంచి 25 లక్షల వరకూ దోచుకునేది. నకిలీ నియామకాలను లెటర్లను అందించేవారు. నిందితుల నుంచి పోలీసులు రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో భూములు, స్థలాలు కొన్నట్లు తెలిసింది. వీటిని జప్తు చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
స్థలాల పేరుతో మహిళలకు రూ.25 లక్షల మస్కా
మైసూరు: తక్కువ ధరకు ఇంటి స్థలం ఇప్పిస్తామని ముగ్గురు మహిళలను నమ్మించిన మోసగాడు.. వారికి రూ.25 లక్షలు టోపీ వేశాడు, ఈ ఘటన మైసూరులో వెలుగు చూసింది. ఏకలవ్యనగర నివాసి అనురాధ, ఆమె స్నేహితురాళ్లు జయమ్మ, శ్వేత అనే మహిళలు అదే బడావణెకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనురాధ అనే మహిళకు పరిచయం ఉన్న శ్రీధర్ తక్కువ ధరకు ఇంటి స్థలాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో రూ.10 లక్షలు ఇచ్చింది. తన స్నేహితురాళ్లయిన శ్వేత, జయమ్మల నుంచి కూడా రూ.15 లక్షలు ఇప్పించింది. డబ్బు తీసుకుని ఏడాది గడిచినా శ్రీధర్ స్థలాలు ఇప్పించలేదు. డబ్బు తిరిగి ఇవ్వాలని అనురాధ కోరడంతో నిందితుడు, అతని కుటుంబ సభ్యులు ఆమైపె దాడి చేశారు. మేటగళ్లి పోలీసు స్టేషన్లో ఆరుగురిపై కేసు నమోదైంది.


