బళ్లారిటౌన్: తాలూకాలోని కొళగల్ గ్రామంలో గత 25 ఏళ్లుగా నూతన రథోత్సవాన్ని జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడేళ్లుగా ఈ రథోత్సవం స్తంభించి పోవడంతో గ్రామస్తులతో పాటు ఇతర గ్రామాల భక్తుల్లో కూడా అసంతృప్తి నెలకొంది. ఎర్రితాత శిష్యుడు ఎరియప్ప తాత మృతి చెందడంతో ఆయన ఆ మఠంలోని సమాధి వద్ద విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాటు చేసే విషయంలో గ్రామంలో ఇరువర్గాలకు మధ్య చెలరేగిన వివాదంతో గత మూడేళ్ల నుంచి రథోత్సవాన్ని జరుపుకోవడం రద్దు చేశారు. గ్రామంలో శాంతి భద్రతల రక్షణ కోసం జిల్లా యంత్రాంగం ఈ రథోత్సవాన్ని రద్దు చేసింది. అయితే మూడేళ్లుగా ఉత్సవాలు జరుపుకోవడం రద్దు చేయడంతో చాలా మంది గ్రామస్తులు జిల్లా యంత్రాంగానికి, పోలీస్ అధికారులకు కూడా ఉత్సవాలు జరపాలని విజ్ఞప్తి చేశారు. అయితే మరో వర్గం వారు ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఉత్సవాలు నిర్వహించడం సబబు కాదని అధికారులతో వాదించారు.
చివరకు ఫలించిన చర్చలు
దీంతో గత వారం రోజులుగా జిల్లా పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం మూడు నాలుగు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. తహసీల్దార్ సమక్షంలో పోలీసు బలగాలతో పాటు గ్రామస్తుల సమక్షంలో జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. చివరికి మంగళవారం సాయంత్రం రథోత్సవం జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రథాన్ని షెడ్లో నుంచి పోలీసుల సమక్షంలో బయటకు తీశారు. కాగా 25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ నూతన రథానికి గతంలో సుమారు 10 ఏళ్ల పాటు సామూహిక వివాహాలు జరిపి ఎంతో భక్తిని చాటారు. ఇతర జిల్లాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే ఎర్రితాతను దర్శించుకుని మొక్కులను తీర్చుకొనే వారు. అయితే మూడేళ్ల క్రితం విగ్రహ ప్రతిష్టాపన విషయంలో ఇరు వర్గాల్లో వివాదం చెలరేగడంతో ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. దీంతో జిల్లా యంత్రాంగం కూడా గత మూడేళ్లుగా ఎంత ప్రయత్నించినా అప్పట్లో చర్చలు విఫలం అయ్యాయి. ఈసారి నాలుగు, ఐదు రౌండ్లు జరిపిన చర్చలు సఫలం కావడంతో గ్రామస్తుల్లో చాలా వరకు హర్షం వ్యక్తమైంది.
భక్తుల్లో వెల్లివిరిసిన ఆనందం
మూడేళ్లుగా స్తంభించిన వైనం


