బొమ్మనహళ్లి: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత శ్రావణ బెళగోళలో వింధ్యగిరిలో బాహుబలి గోమటేశ్వరుని విగ్రహం ముందు విశేష పూజలు నిర్వహించారు. ప్రముఖ జైన గురువులు పాల్గొని అనేక నైవేద్యాలను సమర్పించి పూజించారు. మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తులు బాహుబలి పాదాలకు కొబ్బరి నీరు, పండ్లరసాలు, కల్కచూర్ణం, పసుపు పొడి, కషాయం, ఔషధాలతో అభిషేకం నిర్వహించారు. రక్త చందనం, అష్టగంధం, కేసరి, శ్రీగంధంతో అభిషేకం చేసి, ప్రపంచ శాంతి కోసం మహాశాంతిధారణ చేశారు.
బసవేశ్వరస్వామి రథోత్సవం
తుమకూరు: సోంపుర ఫిర్కాలో సుప్రసిద్ధ నిడవంద గ్రామంలో వెలసిన శ్రీబసవేశ్వర స్వామి ఆలయం బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తిని 40 అడుగుల ఎత్తైన తేరులో ఉంచి ఊరేగించారు. తేరును లాగగానే భక్తులు అరటిపండ్లు, దవనాన్ని విసిరారు. ఆదివారం రాత్రి వందలాది భక్తులు అగ్నిగుండంలో నడిచారు. స్థానికులు భక్తులకు చల్లని పానీయాలు, అన్నదానం సంతర్పణ చేశారు. దాబస్పేటె పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
కొత్త స్నేహాల వైపు చూపు
● సిలికాన్ సిటీలో డేటింగ్
యాప్లకు గిరాకీ
సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీలో కొత్త కొత్త స్నేహాల కోసం పురుషులు, మహిళలు డేటింగ్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. ఈ మేరకు ఓ డేటింగ్ యాప్ గణాంకాలను విడుదల చేసింది. డేటింగ్ యాప్ల వినియోగదారుల్లో సుమారు 65 శాతం మంది పురుషులు, 35 శాతం మంది మహిళలు ఉన్నట్లు తెలిసింది. బెంగళూరులో ఈ ట్రెండ్ అధికంగా ఉండడం గమనార్హం. బెంగళూరు తరువాత హైదరాబాద్ వాసులు ఉన్నారు. గత రెండేళ్లలో ఈ అప్లికేషన్లో చేరుతున్న మహిళల సంఖ్య 148 శాతం పెరిగినట్లు తెలిసింది. ఇందులో వైద్యులు, చార్టెడ్ అకౌంటెంట్ వంటి ప్రొఫెషనల్స్ కూడా జోడు కోసం వెతుకులాడడం విశేషం. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు ఆధునిక సంబంధాల వైపు చూస్తున్నట్లు సామాజిక నిపుణులు తెలిపారు. యాప్ వాడకందారులు రోజులో ఒక గంటకు పైగా చాటింగ్లో గడుపుతున్నట్లు తెలిపారు.


