దొడ్డబళ్లాపురం: ముందు వెళ్తున్న లారీని కారు వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడే దుర్మరణం చెందగా, మరొకరు గాయపడ్డారు. బెంగళూరు సమీపంలో కనకపుర మెయిన్ రోడ్డులోని కగ్గలీపుర అగర క్రాస్ వద్ద జరిగింది. సయ్యద్ బాషా (22), యూనస్ బాన్ (23), అజహర్ బాషా (22) మృతులు కాగా, ఫరాజ్ క్షతగాత్రుడు. నలుగురూ ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కారులో జాలీ రైడ్కు బయలుదేరారు. అతి వేగం వల్ల అదుపుతప్పి లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. మృతులు బెంగళూరువాసులని సమాచారం. కగ్గలీపుర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
స్ఫూర్తిదాయకం..
మహిళా దినోత్సవం
శివాజీనగర: అంతర్జాతీయ మహిళా దినాచరణ సందర్భంగా బెంగళూరులో వివిధ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. హెబ్బాళ ఫ్లై ఓవర్ కింద నారీ శక్తి రైడ్ పేరిట మహిళా బైకర్ల ర్యాలీ జరిగింది. వివిధ ప్రాంతాల గుండా ర్యాలీ జరిపారు. ఇందులో మహిళా క్యాబ్ డ్రైవర్లు, వైద్యులు, టెక్కీలు పాల్గొన్నారు. ధైర్యం, ఐక్యత, ఆత్మవిశ్వాసానికి మహిళలు ప్రతీక అని వక్తలు కొనియాడారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచి, సమాజానికి ఉత్తమ సందేశాన్ని ఇస్తాయని తెలిపారు. నగరవ్యాప్తంగా మహిళలచే సమావేశాలు, చైతన్య ర్యాలీలు జరిగాయి.
మైసూరులో స్వచ్ఛతా నినాదం
మైసూరు: మైసూరు మహానగర పాలక సంస్థ ఆదివారం స్వచ్ఛతా రోడ్ షో నిర్వహించింది. నగరంలోని అంబా విలాస్ ప్యాలెస్ ముందు మంత్రి డాక్టర్ హెచ్.సి.మహదేవప్ప జెండా ఊపి రోడ్ షోను ప్రారంభించారు. మైసూరులో పరిశుభ్రత, మాదకద్రవ్యాల నివారణ, ఆరోగ్య సమస్యల గురించి పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మైసూరు నగరం ప్రపంచ ప్రసిద్ధి చెందడానికి కారణం నాల్వడి కృష్ణరాజ ఒడయార్ అని అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచి, దానిని తరువాతి తరానికి అప్పగించాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని ఆయన అన్నారు. రోడ్లపై చెత్త వేయడం, పెంపుడు జంతువులచే మలవిసర్జన చేయడం వంటిని నిలిపివేయాలని కోరారు. మహిళా దినోత్సవాన్ని స్మరిస్తూ కుటుంబ నిర్మాణం, మెరుగైన సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర ముఖ్యమైనదన్నారు. ఈ సందర్భంగా అలనాటి వింటేజ్ కార్లు, మహిళా బైకర్లు, కళా బృందాలు, పౌర కార్మికులు, విద్యార్థుల ప్రదర్శనలు రంజింపజేశాయి. ఎమ్మెల్యేలు తన్వీర్ సేట్, జీటీ దేవెగౌడ, కె.హరీష్ గౌడ, కలెక్టర్ లక్ష్మికాంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


