చెత్త సుడిలో రాజధాని
శివాజీనగర: బెంగళూరులో చెత్త సమస్య క్లిష్టమవుతోంది. నిత్యం నగరంలో పోగయ్యే ఐదారు వేల టన్నుల చెత్తను నింపుకొని వెళుతున్న లారీలను బెళ్లళ్లి డంపింగ్ యార్డ్ వద్ద గ్రామస్తులు అడ్డుకొంటున్నారు. తమ గ్రామం వద్ద డంపు చేయవద్దని ధర్నా చేస్తున్నారు. దీంతో చెత్త లారీలు డంపింగ్ యార్డ్ వద్ద కిలోమీటర్ వరకు బారులుతీరి నిలిచిపోయాయి. బాగలూరు, మహదేవపుర, దొడ్డబళ్లాపురతో పాటుగా పలు డంపింగ్యార్డుల్లో చెత్త లారీలను ఆయా గ్రామస్తులు అడ్డుకొంటూ ఉన్నారు. దీంతోపాటు చెత్త సేకరణకు పౌరకార్మికులు రాకపోవడంతో ఉద్యాన నగరంలో చెత్తకుప్పలు విస్తరిస్తున్నాయి.
గార్బేస్ సిటీ చేస్తారా: అశోక్
బీజేపీపక్ష నేత ఆర్.అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వానికి చెత్తను తొలగించే ఉపాయం లేదని మండిపడ్డారు. బెంగళూరులో మూడు రోజుల నుంచి చెత్తను తరలించడం లేదు, రింగ్ రోడ్డుకు వెళితే రోడ్డు పొడవునా చెత్త రాశులే ఉన్నాయి. మరో రెండు రోజులు గడిస్తే గార్బేజ్ సిటీ అవుతుందని దుయ్యబట్టారు. పౌర కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. నగరం చెత్తతో దుర్వాసన వెదజల్లుతోందన్నారు.
బీజేపీ నేతల ఇంటి ముందు చెత్త వేయిస్తా: డీసీఎం
బీజేపీ చెత్త విమర్శలపై డీసీఎం డీ.కే.శివకుమార్ మండిపడ్డారు. బీజేపీ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. విజయేంద్ర, ఆర్.అశోక్ ఇంటి ముందు చెత్త వేయిస్తా.. అని హెచ్చరించారు. గౌరవంగా ఉంటే సరి, లేకపోతే ఎస్మా చట్టం కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చెత్తను ఎక్కడైనా ఒకచోట వేయాలి కదా? అక్కడ వద్దు, ఇక్కడ వద్దు అంటే ఎక్కడికి వెళ్లాలి? ఈ చెత్త అశోక్ ఇంటికి, విజయేంద్ర ఇంటికి గానీ, బీజేపీ ఆఫీస్కు గానీ వెళ్లాలి అని అన్నారు. ఫలానా చోట చెత్త డంపింగ్ వద్దని దొడ్డబళ్లాపుర ఎమ్మెల్యే ధర్నా చేశారు, వీరంతా తమ నియోజకవర్గానికి నిధులు కావాలని బ్లాక్బెయిల్ చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.
డంపింగ్ యార్డుల్లో వేయరాదని
గ్రామస్తుల నిరసన
నగరంలో పేరుకుపోతున్న చెత్తకుప్పలు


