సైలెన్సర్లపై బుల్డోజర్‌ | - | Sakshi
Sakshi News home page

సైలెన్సర్లపై బుల్డోజర్‌

Feb 19 2026 10:15 AM | Updated on Feb 19 2026 10:15 AM

సైలెన

సైలెన్సర్లపై బుల్డోజర్‌

మైసూరు: నగరంలోని బైక్‌లకు కర్కశమైన శబ్దాలను ఇచ్చే సైలెన్సర్లను అమర్చుకుని తిరుగుతున్న పోకిరీలను పోలీసులు అడ్డుకుని సైలెన్సర్లను పెకలించారు. వాటిని రోడ్డుపై పరచి బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. మైసూరు నగరంలో బైక్‌ వీలింగ్‌, ప్రత్యేకమైన సైలెన్సర్లతో భీకరమైన చప్పుళ్లు బైకర్లపై పోలీసులు దృష్టి సారించారు. మొత్తం 378 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి సైలెన్సర్లను నాశనం చేశారు. మున్ముందు కూడా పోకిరీ బైకర్లపై చర్యలు తప్పవని పోలీసు కమిషనర్‌ సీమా తెలిపారు.

నేడు ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా

శివాజీనగర: వేతనాలతో సహా పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేఎస్‌ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు గురువారం బెంగళూరు చలో ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు. ఫ్రీడం పార్కులో ధర్నా చేస్తారు. డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోకుంటే, సాయంత్రం తరువాత బస్సుల సంచారం బంద్‌ చేస్తామని చెప్పారు. కాగా విధులకు హాజరుకాకపోతే చర్యలు తీసుకుంటామని సంస్థ ఎండీ అక్రమ్‌ పాషా తెలిపారు.

నగర చెరువుల్లో పడవ విహారం

● 10 తటాకాల్లో త్వరలో అందుబాటులోకి

బనశంకరి: గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార పరిధిలోని 10 చెరువుల్లో పడవల్లో విహరిస్తూ మజా చేయవచ్చు. నగర ప్రజలు, పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీబీఏ కమిషనర్‌ మహేశ్వర్‌రావ్‌ తెలిపారు. ఇప్పటికే మడివాళ సహా పలు చెరువుల్లో పడవ విహారం సర్వీసులున్నాయి. నగరంలో 5 నగర పాలికేల పరిధిలో తలా 2 చెరువుల్లో బోటింగ్‌కు అనుమతి ఇచ్చారు. కేంద్ర పాలికెలో హలసూరు, కగ్గదాసపుర చెరువులు, పశ్చిమలో నాయండహళ్లి, స్యాంకీ చెరువులు, ఉత్తరలో యలహంక, రాచేనహళ్లి చెరువులు, తూర్పులో వెంగయ్యన చెరువు, రాంపుర చెరువు, దక్షిణలో బేగూరు, మడివాళ చెరువుల్లో పడవ సర్వీసులు ఆరంభిస్తారు. పర్యాటక శాఖ దీనిని చేపడుతుంది. పెడల్‌, బ్యాటరీ పడవలను మాత్రమే ఉపయోగిస్తారు. చెరువులు కలుషితం కాకుండా చూడాలని తెలిపారు. ఆదాయం 20 శాతం నగదును కర్ణాటక చెరువు సంరక్షణ అభివృద్ధి ప్రాధికార కు అందించాలి.

ఇద్దరిని బలిగొన్న సెప్టిక్‌ ట్యాంకు

సాక్షి, బెంగళూరు: సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసేందుకు దిగిన ఇద్దరు విషవాయువులకు గురై మరణించిన ఘటన కలబురిగి హీరాపుర లేఔట్‌ సమీపంలో జరిగింది. ఇంటి యజమాని శివకుమార్‌ (52), రతన్‌(60) అనే ఇద్దరు సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేసేందుకు దిగి ఊపిరి ఆడక మరణించారు. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

కోలారులో హెలికాప్టర్ల ఫ్యాక్టరీ

కోలారు: కోలారు తాలూకాలోని వేమగల్‌ పారిశ్రామికవాడలో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌(టీఏఎస్‌ఎల్‌), ఎయిర్‌బస్‌ ఉత్పత్తి సంస్థ సంయుక్తంగా రూ.1000 కోట్లతో హెలికాప్టర్‌ తయారీ యూనిట్‌ను ముంబై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్‌ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ వర్చువల్‌గా ప్రారంభించారు. భారత వాయుయానం, రక్షణరంగంలో చారిత్రాత్మక మైలురాయి అని పేర్కొన్నారు. హెలికాప్టర్ల విడిభాగాలను ఇక్కడకు తరలించి వాటిని కూర్చి రూపొందిస్తారు. ఇందులో సాధారణ, సైనిక హెలికాప్టర్లు ఉంటాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే 20 సంవత్సరాల్లో ఇక్కడ 500 హెలికాప్టర్లు తయారవుతాయని మంత్రి పాటిల్‌ చెప్పారు. ఈ యూనిట్‌ కోసం ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్రాలు పోటీ పడ్డాయన్నారు. అయితే చివరికి కర్ణాటకకే దక్కిందన్నారు.

సైలెన్సర్లపై బుల్డోజర్‌ 1
1/2

సైలెన్సర్లపై బుల్డోజర్‌

సైలెన్సర్లపై బుల్డోజర్‌ 2
2/2

సైలెన్సర్లపై బుల్డోజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement