విధానసౌధలో కలంపై కట్టడి
బనశంకరి: రాష్ట్ర చట్టసభల్లో కలం, కెమెరాపై నిబంధనల పోటు పడింది. విధానసౌధలో మీడియాకు లక్ష్మణరేఖను గీయడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిరంతరం వ్యక్తి స్వాతంత్య్రం, స్వేచ్ఛ అని మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబాట్లను అమలు చేస్తోంది. భద్రత నెపంతో సిబ్బంది, పరిపాలనశాఖ మీడియా మీద కొత్త ఆంక్షలను విధించింది. మీడియాతో భద్రతా సమస్య తలెత్తుతోందని, ఇకపై విదానసౌధలో నిర్ణయించిన స్థలాల్లో మాత్రమే ప్రజాప్రతినిధుల నుంచి స్పందన తీసుకోవాలని తెలిపింది. సిబ్బంది, పరిపాలనశాఖ.. వార్తా ప్రసార శాఖకు ఈ మేరకు లేఖ రాసింది.
చోరీ ఘటనకు కవరేజీ ఇస్తే..
విధానసౌధలో భద్రత కరువైందని, మంత్రి ఆఫీసులోనే డబ్బు, బంగారు చైన్ దోపిడీకి గురైనట్లు పదేపదే మీడియాలో వార్తలు రావడంతో సిద్దరామయ్య ప్రభుత్వం ఆగ్రహించినట్లు తెలిసింది. ఇకపై విధానసౌధలో ఎక్కడంటే అక్కడ రాజకీయ నేతలతో విలేకరులు మాట్లాడడం, వీడియో తీసుకోరాదు. సౌధ కారిడార్లు, మరికొన్ని ప్రదేశాల్లో నిషేధం విధించారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా విధానసౌధలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల దృష్టికి విలేకరులు తీసుకువెళ్లి చర్చించేవారు. ఇప్పుడా సౌకర్యం లేకుండా చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు, మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ ప్రభుత్వ తీరును ఖండించారు. మంత్రి కార్యాలయంలో నగదు, బంగారం పోయిందని వార్తలు ప్రసారం చేస్తే, మీడియాను నియంత్రిస్తున్నారని దుయ్యబట్టారు.
పలు ఆంక్షలు విధించిన సర్కారు
విధానసౌధలో కలంపై కట్టడి


