నమో లక్ష్మీనారాయణా..
మాలూరు: తాలూకాలోని లక్కూరు గ్రామంలో ఉన్న పురాతన శ్రీలక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ధనుర్మాస పూజలను మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అర్చకులు సురేష్ చైతన్య నేతృత్వంలో మూల విగ్రహానికి పంచామృత అ భిషేకం, వేదమంత్రపారాయణం, అలంకారం, మంగళహారతి సాగించారు. ఆలయంలోని శ్రీ కన్నికా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీసోమేశ్వర స్వామి, శ్రీఆంజనేయస్వామి, నవగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకున్నారు.
సంపులో పడి తల్లీబిడ్డల మృతి
● తుమకూరు వద్ద ఘోరం
తుమకూరు: తుమకూరు తాలూకాలోని హిరేహళ్లి సమీపంలోని సంగనహళ్లి కాలనీలో మంగళవారం తమ ఇంటి పక్కన ఉన్న సంప్లో పడి తల్లి, ఆమె కవల పిల్లలు అనుమానాస్పద రీతిలో చనిపోయారు. విజయలక్ష్మి (26), 5 ఏళ్ల పాప చేతన, బాబు చైతన్య మృతులు. సాయంత్రం 4 గంటలప్పుడు సంప్లో పడిపోయారని తెలిసి ఫైర్ సిబ్బంది వచ్చారు. అందులో నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంపు సుమారు 10 అడుగుల లోతు ఉంది. అనుకోకుండా పడిపోయారా, లేక ఆత్మహత్యా? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
బళ్లారిపై సీబీఐ దర్యాప్తు: బీజేపీ
శివాజీనగర: బళ్లారిలో 1వ తేదీన జరిగిన అవాంఛనీయ ఘటనల గురించి రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసిందని ఎమ్మెల్సీ సీటీ రవి తెలిపారు. బెంగళూరులో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బళ్లారిలో జనార్దనరెడ్డి హత్యకు ప్రయత్నం జరిగింది. అదుపు తప్పి కాంగ్రెస్ కార్యకర్త చనిపోయాడు, దీనిమీద సీబీఐ దర్యాప్తు చేయించాలని కోర్ కమిటీలో నేతలు తీర్మానించారన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులపై జేడీఎస్తో సమాలోచన జరిపి అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర.. జేడీఎస్తో మాట్లాడతారని కోర్ కమిటీ నిర్ణయించిందన్నారు. యడియూరప్ప, సహ ఇన్చార్జి సుధాకర్రెడ్డి, కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి తదితరులు కమిటీ భేటీలో పాల్గొని రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారన్నారు.
రూ.3.5 కోట్ల డ్రగ్స్ సీజ్
● టెక్కీ, మరొకరు అరెస్టు
బనశంకరి: న్యూ ఇయర్ పార్టీల్లో విక్రయాల కోసం శ్మఽశానంలో డ్రగ్స్ దాచిపెట్టిన ఇద్దరిని బెంగళూరు అశోకనగర పోలీసులు అరెస్ట్చేశారు. వీరి నుంచి రూ.3.5 కోట్ల విలువచేసే ఎండీఎంఏ క్రిస్టల్ మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ కమిషనర్ సీమంత్కుమార్సింగ్ తెలిపారు. కేసు వివరాలను ఆయన తెలిపారు. చిక్కబాణసవాడి నివాసి, టెక్కీ మహమ్మద్ తారిఖ్ ఇక్బాల్, కాడుగోడి శీగేహళ్లివాసి షేక్ అహ్మద్ అబ్రాజ్ అనే ఇద్దరు నిందితులు. హోసూరురోడ్డు హిందూశ్మశానంలో ఓ సమాధి పక్కన డ్రగ్స్ను దాచి ఉంచి, గిరాకీలకు విక్రయించేవారు. పోలీసులకు తెలిసి దాడి చేసి 2.48 కేజీల ఎండీఎంఏ, బైక్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సీగేహళ్లి ఇంట్లో దాచిపెట్టిన 720 గ్రాముల ఎండీఎంని వశపరచుకున్నారు. మొత్తం డ్రగ్స్ విలువ రూ.3.5 కోట్లు అని తెలిపారు.
ల్యాప్టాప్ చోరీల్లో స్పెషలిస్టులు
యశవంతపుర: సిలికాన్ సిటీలో పీజీ హాస్టళ్లలోకి చొరబడి ల్యాప్టాప్లను ఎత్తుకెళ్లే ఇద్దరు ఘరానా చోరులను ఎలక్ట్రానిక్ సీటీ పోలీసులు అరెస్ట్ చేసి రూ.40 లక్షల విలువగల 48 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని ఓ ఎమ్మెల్యే బంధువు, ఐటీ ఇంజనీరు గౌతమ్, రాజదొరైలను పోలీసులు అరెస్ట్ చేశారు. దొడ్డతోగూరు అబ్బయ్యస్టీట్లోని ఒక పీజీలో డిసెంబర్ 28న ల్యాప్టాప్లు చోరీ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టగా మొదట రాజదొరై దొరికాడు. అతనిని ప్రశ్నించగా నగరంలో వివిధచోట్ల ల్యాప్టాప్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు గౌతమ్ను అత్తిబెళెలో అరెస్ట్ చేశారు. వీరు తమిళనాడులో అమ్మిన 6 ల్యాప్టాప్లు, స్నేహితులకు అమ్మిన 9 ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 38 మంది సొంతదారులను ఇప్పటివరకు గుర్తించారు.
నమో లక్ష్మీనారాయణా..
నమో లక్ష్మీనారాయణా..


