గ్రేటర్ బెంగళూరులో లోకాయుక్త దాడులు
బనశంకరి: బెంగళూరులో గ్రేటర్ బెంగళూరు ప్రాధికార ఆఫీసులో మంగళవారం లోకాయుక్త అధికారులు సోదాలు జరిపారు. ఆర్ఆర్ నగరలో నాసిరకం పనులు చేపట్టారని ఫిర్యాదులు రావడంతో ఆకస్మిక దాడులు చేశారు. 2019–21 మధ్య 6 వార్డుల్లో రోడ్లు, ఫుట్పాత్, భూగర్భ డ్రైనేజీ తో పాటు వివిద అభివృద్ధి పనుల్లో రూ.250 కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని మాజీ బెంగళూరు గ్రామాంతర ఎంపీ డీకే.సురేశ్ లోకాయుక్త కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పాలికె టెక్నికల్ సెల్ చీఫ్ ఇంజనీర్ దొడ్డయ్య, అసిస్టెంట్ ఇంజనీర్లు సతీశ్, శిల్పా, భారతి, బసవరాజ్, సిద్దరామయ్య, ఉమేశ్ తదితర 9 మంది అధికారులు కార్యాలయాలు, ఇళ్లలోను తనిఖీలు ప్రారంభించారు. అలాగే గ్రామీణాభివృద్ధి మండలితో పాటు 13 చోట్ల సోదాలు జరిపినట్లు లోకాయుక్త ఎస్పీ శివప్రకాష్ దేవరాజ్ తెలిపారు.
లంచగొండి ఇంజనీర్లు అరెస్టు
● తుమకూరు జిల్లాలో లోకాయుక్త దాడులు
తుమకూరు: చేసిన పనులకు బిల్లులు మంజూరు చేసి ఇచ్చేందుకు కాంట్రాక్టర్ వద్ద నుంచి లంచం తీసుకుంటూ తిపటూరులో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు ఇద్దరు మంగళవారం లోకాయుక్త వలలో చిక్కారు. వివరాలు.. పాఠశాల మరమ్మతు చేసినందుకు రూ.6.50 లక్షల బిల్లులు కాగా, మంజూరు చేయాలని కాంట్రాక్టర్ సునీల్ దరఖాస్తు చేశారు. బిల్లు సొమ్ము చెల్లింపునకు రూ.47,500 లంచం ఇవ్వాలని ఇద్దరు ఇంజినీర్లు డిమాండ్ చేశారు. మొదటి కంతుగా రూ.13 వేలను కంప్యూటర్ ఆపరేటర్ హరీష్ బ్యాంకు ఖాతాకు సునీల్ బదిలీ చేశారు. మిగిలిన రూ.34,500 ను తిపటూరు పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద తీసుకుంటుండగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బీసీ స్వామిని లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక ఇంజినీర్ సుహాస్ను తిపటూరు కార్యాలయంలో పట్టుకుని విచారణ చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ హరీష్ను అదుపులోకి తీసుకున్నారు. లోకాయుక్త ఎస్పీ లక్ష్మీనారాయణ్ నేతృత్వంలో దాడి చేశారు.
ఆర్ఆర్ నగరలో రూ.250 కోట్ల అక్రమాలపై ఫిర్యాదు
గ్రేటర్ బెంగళూరులో లోకాయుక్త దాడులు
గ్రేటర్ బెంగళూరులో లోకాయుక్త దాడులు


