బాలింత బలవన్మరణం
శివమొగ్గ: ఐదు నెలల పసిగుడ్డును వదిలి బాలింత ఆత్మహత్య చేసుకున్న సంఘటన శివమొగ్గ తాలూకాలోని కుడుమల్లిగె వద్ద ఆక్సల్కొప్పలో జరిగింది. వివరాలు.. రమ్య (28)కు రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఐదు నెలల కిందట మరో కొడుకు జన్మించాడు. భర్త వ్యవసాయం చేసేవాడు. రమ్య కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో విరక్తి చెంది శుక్రవారం పురుగుల మందును తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను శివమొగ్గ నగరంలో ఉన్న మెగ్గాన్ ఆస్పత్రికి తరలించారు. శనివారం పరిస్థితి విషమించి కన్నుమూసింది. అమ్మా అంటూ చిన్నారి కొడుకు, పసికందు విలపించడం అందరినీ కలచివేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
సుప్రీంలో పవిత్ర బెయిలు
అర్జీ రద్దు
యశవంతపుర: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో మొదటి నిందితురాలు, నటి పవిత్ర గౌడకు మళ్లీ నిరాశే దక్కింది. సుప్రీంకోర్టులో ఆమె దాఖలు చేసిన బెయిలు పిటిషన్ను శనివారం కోర్టు కొట్టివేసింది. ఆమెకు గతంలో ఇచ్చిన బెయిలు రద్దు కావడంతో ఇప్పటికే బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఖైదులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబం, కూతురు ఉంది, ఆ అవసరాల దృష్ట్యా బెయిలును ఇవ్వాలని ఆమె అర్జీ దాఖలు చేశారు. ఆమె పిటిషన్ను తిరస్కరించడంతో, ఈ నెల 10 నుంచి కేసు విచారణను జరపాలని బెంగళూరు సీసీహెచ్ కోర్టు నిర్ణయించింది.
టూర్ బస్సు పల్టీ, 16 మంది
విద్యార్థులకు గాయాలు
యశవంతపుర: విహారయాత్రలో విషాదం జరిగింది. విద్యార్థుల బస్సు పల్టీ పడి 16 మంది గాయపడ్డారు. ఈ ఘటన చిక్కమగళూరు జిల్లా శృంగేరి తాలూకా కావడి గ్రామం వద్ద జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని చెళ్లకెరె వాసవి పీయూ కాలేజీకి చెందిన విద్యార్థులు ప్రైవేట్ బస్సులో చిక్కమగళూరు జిల్లాకు విహారయాత్రకు వెళ్లారు. బస్సు శుక్రవారం రాత్రి మలుపు వద్ద పల్టీలు కొట్టింది. 5 మంది తీవ్రంగా, 11 మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో ఐదుమందికి తీవ్ర గాయాలు తగిలాయి, కొందరికి శృంగేరిలో, తీవ్రంగా గాయపడినవారిని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే చెళ్లకెరె నుంచి తల్లిదండ్రులు హుటాహుటిన శృంగేరికి వెళ్లారు.
బాలింత బలవన్మరణం
బాలింత బలవన్మరణం


