ఓంకారేశ్వరాయ నమః
బనశంకరి: కార్తీక మాసం సోమవారం సందర్భంగా ఉత్తరహళ్లి–కెంగేరి మార్గంలో ద్వాదశ జ్యోతిర్లింగ దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి. మధుసూదనానంద పురి స్వామీ ఓంకారేశ్వర శివలింగంతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాలకు భస్మహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బస్సుల్లో భద్రతా తనిఖీలు చేయాలి
శివాజీనగర: ఆంధ్రప్రదేశ్ కర్నూల్ వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదం నేపథ్యంలో కేఎస్ ఆర్టీసీ బస్సుల్లో పేలుడు, మండే వస్తువులను ప్రయాణికులు తీసుకెళ్లడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ప్రతి బ్యాగ్ను సిబ్బంది చెక్ చేయాలని, భద్రతా చర్యలను పటిష్టం చేయాలని రవాణా మంత్రి రామలింగారెడ్డి ఆదేశించారు. ప్రమాదం జరగకుండా చూడాలని, జరిగితే ప్రాణనష్టం లేకుండా బయటపడే సదుపాయాలు ఉండాలని తెలిపారు.
ఘాట్ రోడ్డులో ట్యాంకర్ ఆటంకం
యశవంతపుర: చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా చార్మాడి ఘాట్ హైవేలో 10 చక్రాల సిమెంట్ ట్యాంకర్ రోడ్డు మధ్యలో చెడిపోయింది. దీనితో గంటల కొద్దీ ఘాట్ మార్గంలో వాహనాలు నిలిచిపోయ్యాయి. బెంగళూరు నుంచి మంగళూరుకు వెళుతున్న సిమెంట్ లారీ ఘాట్ మార్గంలో మొరాయించింది. అటు ఇటు వందలాదిగా వాహనాలు చిక్కుకుపోయాయి. ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. కొట్టిగేహర చెక్పోస్ట్లో ట్యాంకర్ను అడ్డుకోకుండా అనుమతించారని, దానివల్ల సమస్య వచ్చిందని స్థానికులు ఆరోపించారు. అధికారులు, స్థానికులు ట్యాంకర్ను ఎంతో కష్టమ్మీద రోడ్డు పక్కకు చేర్చి నెమ్మదిగా సంచారానికి వీలు కల్పించారు.
ఎయిర్పోర్టులో
గంజాయి సీజ్
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్టులో ఒక ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తుండగా 2.5 కేజీల గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుని బ్యాగులో గంజాయి లభించింది. తనిఖీలలో గుర్తు పట్టకుండా బ్యాగ్ కింద భాగంలో గంజాయి దాచాడు. ఎయిర్పోర్టు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితున్ని అరెస్టు చేశారు.
మహిళ హత్య కేసులో
వీడిన మిస్టరీ
దొడ్డబళ్లాపురం: తన స్నేహితునితో చనువుగా ఉందనే కారణంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని హత్య చేసిన కేసులో బెంగళూరు తిలక్ నగర పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సుబ్బుమణి, సెంథిల్ అరైస్టెన నిందితులు. గత వారం సల్మా (35) అనే మహిళ మృతదేహం ఒక ఆటోలో పడి ఉంది. ఈమె తిలక్ నగర పీఎస్ పరిధిలో నివసిస్తుండేది, నలుగురు పిల్లలు ఉండగా, భర్త గతంలో చనిపోయాడు. సుబ్బుమణితో కలిసి ఉంటోంది. అయితే సుబ్బుమణి స్నేహితుడు సెంథిల్తోనూ చనువుగా ఉండడం చూసి, చంపాలని నిశ్చయించాడు. హత్యకు ముందు సల్మా, సుబ్బుమణి, సెంథిల్ ముగ్గురూ బాగా తాగారు. వారిద్దరూ మత్తులో జారుకున్నాక సుబ్బుమణి రాగిముద్ద గెలికే కట్టెతో ఆమె తలపై బాది హత్య చేశాడు. మృతదేహాన్ని చెడిపోయిన పాత ఆటోలో ఉంచి సుబ్బుమణి, సెంథిల్ పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తుమకూరులో ఉన్నట్టు తెలిసి నిందితులను అరెస్టు చేయించి నగరానికి తరలించారు.
నెలమంగలలో
తుపాకీ కాల్పులు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో నెలమంగల ఇస్లాంపురలో రివాల్వర్ పేలింది... గ్రామ పంచాయతీ సభ్యునిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. జీపీ సభ్యుడు సలీం ఇంటి ముందు మొబైల్లో మాట్లాడుతుండగా దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. సలీం చేతికి, కాలికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఎవరు ఎందుకు కాల్పులు జరిపారన్నది తెలిసిరాలేదు. నెలమంగల గ్రామీణ పోలీసులు విచారణ చేపట్టారు.
ఓంకారేశ్వరాయ నమః
ఓంకారేశ్వరాయ నమః


