
ఆ అధికారిని సస్పెండ్ చేయండి
రాయచూరు రూరల్: ఆర్ఎస్ఎస్ కవాతులో పాల్గొన్న అధికారిని విధుల నుంచి తొలగించాలని భీమ్ ఆర్మీ జిల్లాధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల్ మానప్ప ఆప్త కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ కుమార్ పంచాయతీ అభివృద్ధి అధికారిగా ఉంటూ ఇటీవల లింగసూగూరులో జరిగిన ఆర్ఎస్ఎస్ కవాతులో గణ వేషధారిగా ర్యాలీలో పాల్గొన్న అధికారిని సస్పెండ్ చేయాలన్నారు.
దురలవాట్లకు దూరంగా ఉండాలి
రాయచూరు రూరల్: యువత దురలవాట్లకు దూరంగా ఉండాలని సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. మంగళవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ధర్మ స్థల క్షేత్ర సంస్థ, కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించి మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో మద్యపానం, ధూమపానం సేవించడం వల్ల కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. మద్యపాన నియంత్రణకు మానవతా విలువలను పెంచుకోవాలన్నారు. నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, శరణమ్మ, శ్రీకాంత్లున్నారు.
కులమతాల మధ్య ఆర్ఎస్ఎస్ చిచ్చు
రాయచూరు రూరల్: దేశానికి ఆర్ఎస్ఎస్ అందించిన సేవలు శూన్యమని, కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న సంస్థను నిషేధించాలని ముఖ్యమంత్రికి మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాయడం తప్పా? అని ఎమ్మెల్సీ వసంత కుమార్ ప్రశ్నించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాల్లో సభలు, సమావేశాలకు నిర్వహించడానికి అవకాశం కల్పించరాదని లేఖ రాయడం తప్పా? అని నిలదీశారు. ఏనాడూ దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన లేదన్నారు. ఆర్ఎస్ఎస్ సంస్థను 1962, 1971, 1977, 1982, 1992లలో నిషేధించారని గుర్తు చేశారు. బీజేపీ నేతలు ప్రియాంక్ ఖర్గే సీఎం సిద్దరామయ్యకు లేఖ రాశారని, దీనిపై పరిశీలిస్తున్న తరుణంలో నేతలు వాగ్దానాలు చేయడం మంచిది కాదన్నారు. జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నగరసభ సభ్యుడు బసవరాజ్ దరూరు, మారెప్ప, అబ్దుల్ ఖరీం, శ్రీనివాస్, బాబర్, సుధామ, రజాక్ ఉస్తాద్లున్నారు.
డిజిటల్ కంటెంట్ క్రియేషన్ తరగతులు ప్రారంభం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ శిక్షణ తరగతులను మంగళవారం కలబుర్గిలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థ, వీరమ్మ గంగ సిరి కళాశాలలో గణిత శాస్త్ర అసిస్టెంట్ అధ్యాపకురాలు డాక్టర్ సునీత ప్రారంభించారు. నేటి ఆధునిక విద్యా రంగంలో డిజిటల్ కంటెంట్ క్రియేషన్ శిక్షణ తప్పనిసరి అన్నారు. దీని వల్ల విద్యార్థులు నూతన సాంకేతిక రంగంలో వచ్చిన మార్పుల ఆధారంగా విద్యనభ్యసించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేంద్ర, నాగరత్న, స్వాతి, శివలీల, ప్రమీల, మహేష్ గంగ్వార్లున్నారు.
పంట నష్టపరిహారం చెల్లించాలి
రాయచూరు రూరల్: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతులు పొలంలో వేసుకున్న పంటలకు నష్ట పరిహారం చెల్లించాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు లక్ష్మణ గౌడ మాట్లాడారు. అతివృష్టి వల్ల రాయచూరు జిల్లాలో నష్టం సంభవించిందన్నారు. వానలకు నష్టపోయిన పత్తి పంటలకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందించాలన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణాలు రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసి జిల్లాధికారి నితీష్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

ఆ అధికారిని సస్పెండ్ చేయండి

ఆ అధికారిని సస్పెండ్ చేయండి

ఆ అధికారిని సస్పెండ్ చేయండి

ఆ అధికారిని సస్పెండ్ చేయండి