
హుణసిగి ఎస్ఐ సస్పెండ్
రాయచూరు రూరల్: క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదగిరి జిల్లా హుణసిగి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రాథోడ్ సస్పెండ్ అయ్యారు. ఈమేరకు యాదగిరి జిల్లా ఎస్పీ పృథ్విశంకర్ ఆదేశాలు జారీ చేసినట్లు మంగళవారం ఓ పత్రికా ప్రకటనలో పేర్కోన్నారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించిన ఆరోపణలపై హుణసిగి తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజశేఖర్ రాథోడ్ను సస్పెండ్ చేశారు. ఇటీవల రౌడీషీటర్ నాగరాజుతో కలిసి ఎస్ఐ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
రోడ్డు పనులకు
భూమి పూజ
బళ్లారిటౌన్: నగరంలోని వశిష్ట కళాశాల సమీపంలోని శ్రీశృంగేరి శారదాంబ కాలనీ వాసులు చాలా కాలంగా రోడ్డు సమస్యతో బాధపడుతున్న నేపథ్యంలో బుధవారం రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర అభివృద్ధి నిధులతో స్థానిక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షుడు దేవానంద చేతుల మీదుగా రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 దాకా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా సుమారు 2500 మంది జనాభా నివాసం ఉంటున్నారు. అయితే గత 6 ఏళ్లుగా రోడ్డు కోసం పోరాడి చివరికి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర చొరవతో ఆయన నిధులు మంజూరు చేయగా భూమి పూజ జరిపారు. కాగా ఈ ప్రాంతంలో మరి కొన్ని లింక్ రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. వాటిపై కూడా ఎమ్మెల్యే చొరవ చూపాలని స్థానికులు ఆశిస్తున్నారు. స్థానిక ప్రముఖులు మల్లప్ప, అశోక్, మోహన్రెడ్డి, సత్యనారాయణ, లక్ష్మిరెడ్డి, వెంకటేష్, లక్కప్ప, మంజుల తదితరులు పాల్గొన్నారు.
వ్యాపార మహిళకు
సత్కార దండ
రాయచూరు రూరల్: మద్యపానం, ధూమపానం, గుట్కా నియంత్రణకు తోడు గత 20 ఏళ్ల నుంచి దుకాణంలో విక్రయించకుండా వ్యాపారం చేసిన మహిళకు ధర్మస్థల క్షేత్ర సంస్థ, కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలిని అభినందించారు. బుధవారం విజయలక్ష్మిని రాయచూరు తాలూకా సుల్తాన్పుర గ్రామానికి వెళ్లిన కర్ణాటక మద్యపాన నియంత్రణ మండలి అధ్యక్షుడు శరణప్ప ఘనంగా సత్కరించారు. దుకాణంలో ఎలాంటి మత్తు పదార్థాలు, మద్యం, ధూమ పానం, గుట్కా వంటి వాటిని విక్రయించకుండా గట్టి నిర్ణయంతో గ్రామంలో కొంత మేర మద్యపానానికి యువతను దూరంగా ఉంచడంతో ఆమెను అభినందించారు.
ఆయకట్టుకు సక్రమంగా నీరందించండి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని, తుంగభద్ర ఆయకట్టుకు సక్రమంగా నీరు వదలాలని రైతులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో రైతులు మాట్లాడారు. ఆయకట్టు చివరి భూములకు సక్రమంగా నీరందించాలన్నారు. వర్షాలు లేక పంటలు వాడుముఖం పట్టాయని, పశువులకు తా గునీరు లేదని, తాగునీటి కోసం చెరువుల్లోకి నీటిని నింపాలన్నారు. కాలువ కింద రైతులు వరి, పత్తి పంటలు వేశారని సరైన సమయంలో నీటిని విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పచ్చని చెట్టు..
ఆరోగ్యానికి ఆయువు పట్టు
రాయచూరు రూరల్: చెట్లు మానవుడి ఆరోగ్యానికి ప్రాణవాయువులాంటివని ప్ర భుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుగుణ పేర్కొన్నారు. బుధవారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ మనవరాలి నామకరణం సందర్భంగా శివిక పేరుతో మొక్కలు నాటి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అధిక శాతం చెట్ల కింద కూర్చొని సేద తీరుతారన్నారు. అంటే చెట్ల నుంచి వచ్చే గాలిని పీల్చుతుంటారన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు చెట్లు పెంచి పరిసరాలను సంరక్షించాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ శివాని, సిద్దన గౌడ తదితరులు పాల్గొన్నారు.

హుణసిగి ఎస్ఐ సస్పెండ్

హుణసిగి ఎస్ఐ సస్పెండ్