
డిసెంబర్లో సూపర్ స్పెషాలిటీ ప్రారంభం
బళ్లారిటౌన్: రానున్న డిసెంబర్ నెలలో బళ్లారిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని వైద్యవిద్య, కౌశల్య అభివృద్ధి మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటిల్ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని టీబీ శానిటోరియం వద్ద గల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. 450 బెడ్లు కలిగిన ఈ ఆస్పత్రి 2008లో మంజూరు అయిందన్నారు. వివిధ కారణాల వల్ల ఆలస్యం జరిగి 2018లో తిరిగి టెండర్ పిలిచారన్నారు. ప్రస్తుతం నిర్మాణం దాదాపు పూర్తి అయిందని, డిసెంబర్ నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కార్డియాలజిస్టు, ప్లాస్టిక్ సర్జరీ, డయాలజిస్ట్ యంత్రాలు, ఆర్ఓ ప్లాంట్, బెడ్ల సదుపాయాలు వంటివి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. న్యూరాలజీతో పాటు ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వివిధ విభాగాల వైద్యులు గ్రూప్ డీ, సీ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ను ఆదేశించారు.
26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి
నిర్మాణానికి ఆమోదం
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణలో గుర్తించిన 26 ఎకరాల్లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి ఆమోదం లభించిందని, త్వరలోనే టెండర్ పిలిచి పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యా శాఖ కార్యదర్శి మహమ్మద్ హుసేన్, బెంగళూరు వైద్య విద్యా శాఖ డైరెక్టర్ సుజాత రాథోడ్, జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్, జెడ్పీ సీఈఓ మహమ్మద్ హ్యారీస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సండూరులో రూ.300 కోట్ల వ్యయంతో సిల్క్ పార్క్ నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.
విద్యతో పాటు నైపుణ్యత అవసరం
విద్యార్థులకు విద్యతో పాటు నైపుణ్యత కూడా అవసరమని వైద్య విద్యా, కౌశల్య శిక్షణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ శరణ ప్రకాష్ ఆర్.పాటీల్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ నూతనంగా ప్రారంభించిన ఇంకుబేషన్ జాబ్ పోర్టల్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో విద్యార్థులకు డిగ్రీ పుచ్చుకుంటే చాలదన్నారు. చదువుతో పాటు నైపుణ్యత(స్కిల్), పరిజ్ఞానం అత్యవసరమన్నారు. కార్యక్రమంలో ఎఫ్కేసీసీఐ అధ్యక్షుడు ఉమారెడ్డి మాట్లాడుతూ బీడీసీసీఐ విద్యార్థుల కోసం కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తుందన్నారు. వాటిని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ అధ్యక్షుడు యశ్వంత్రాజ్ నాగిరెడ్డి, మేయర్ ముల్లంగి నందీష్, నేతలు మహారుద్ర గౌడ, శ్రీనివాసరావు, అవ్వారు మంజునాథ్, పాలన్న తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది ఖాళీల భర్తీకి అధికారులకు ఆదేశం
వైద్యవిద్యా శాఖ మంత్రి
డాక్టర్ శరణ ప్రకాష్ పాటీల్