
హోంమంత్రితో సిట్ చీఫ్ భేటీ
బనశంకరి: ధర్మస్థల కేసు దర్యాప్తు చేపడుతున్న సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి శుక్రవారం హోంమంత్రి పరమేశ్వర్ను కలిసి చర్చించారు. ధర్మస్థల కేసు దర్యాప్తుపై చిన్నయ్య గ్యాంగ్ ప్రజాప్రయోజనాల వ్యాజ్యం పిటిషన్ను సుప్రీంకోర్టు మే 5 తేదీన తిరస్కరించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం చిన్నయ్య తలపుర్రె తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి సుమోటో కేసు పెట్టడంతో మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అనంతరం కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నాగలక్ష్మీ చౌధరి వందలాది మంది మహిళలపై అత్యాచారం, హత్య చేసిన మృతదేహాలు పూడ్చిపెట్టిన కేసు దర్యాప్తు చేపట్టడానికి సిట్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాశారు. దీని ఆధారంగా సిద్దరామయ్య ప్రణబ్ మొహంతి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేశారు. సిట్ అనేక స్థలాల్లో తవ్వకాలు చేపట్టింది. ధర్మస్థలపై అసత్యప్రచారం చేసిన వారిపై దర్యాప్తు చేసింది.
మే 5న పిటిషన్ తిరస్కృతి
పిటిషన్ మే 5 తేదీన తిరస్కరణకు గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుప్రీంకోర్టు దర్యాప్తు అవసరం లేదంటూ పిటిషన్ను తిరస్కరించడంతో సిట్ ఏర్పాటుపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ మొహంతి, హోంమంత్రి పరమేశ్వర్ నివాసానికి వెళ్లి ఆధారాలతో సహా వివరించారు. సీనియర్ న్యాయవాది కేవీ.ధనంజయ చిన్నయ్య పేరుతో సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో 1995 నుంచి 1998 మధ్య అనేక మృతదేహాలు నేత్రావతి నదిలో తేలియాడుతూ వచ్చాయని, వాటిలో ధర్మస్థల పర్యవేక్షకుడితో బలవంతంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ విధంగా తేలుతూ వచ్చిన శవాల్లో లైంగిక దాడికి గురైన మృతదేహాలు కూడా ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. 2010లో బాలిక మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన గుర్తులు ఉన్నాయని 2008 నుంచి 2014 మధ్య అనేక మృతులు సంభవించగా, వారిలో హత్య, అత్యాచారాలకు గురైనవారు ఉన్నారన్నారు.
సుప్రీంకోర్టు ఆగ్రహం
పిటిషన్ను తిరస్కరించిన సుప్రీంకోర్టు ఇది ప్రజాప్రయోజనాల పిటిషన్ కాదని, పబ్లిసిటీ ఇంట్రెస్ట్ లిటిగేషన్, పైసా ఇంట్రెస్ట్ లిటిగేషన్, ప్రైవేటు ఇంట్రెస్ట్ లిటిగేషన్, పొలిటికల్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సమాచారం తలపుర్రె గ్యాంగ్ దాచిపెట్టి ప్రభుత్వాన్ని దృష్టి మళ్లించి సిట్ ఏర్పాటు చేయడంపై ప్రస్తుతం చర్చకు దారి తీస్తోంది. సిట్ను రద్దు చేసి స్దానిక పోలీసులతో కేసు దర్యాప్తు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. హోంమంత్రి పరమేశ్వర్ శుక్రవారం సిద్దరామయ్యను కలిసి పిటిషన్ తిరస్కరణ, సిట్ ఏర్పాటు, దర్యాప్తు గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి భేటీకి ముందు ప్రణబ్ మొహంతి ఆధారాలతో సహా హోంమంత్రికి వివరణ ఇచ్చారు. శివమొగ్గ జైలులో ఉన్న చిన్నయ్య బెళ్తంగడి కోర్టుకు హాజరై బయటికి వచ్చి కన్నీరుపెట్టారు. చిన్నయ్య వ్యాఖ్యలను గత నాలుగు రోజులుగా నమోదుచేస్తున్న కోర్టు శనివారం కూడా హాజరు కావాలని సూచించింది.
నిజాలు తెలుస్తాయి
యశవంతపుర: ధర్మస్థలపై జరుగుతున్న తప్పుడు ప్రచారంతో రాష్ట్రప్రభుత్వం సిట్ని రచించి నిజాలను బయట పెడుతున్నట్లు ధర్మస్థల ధర్మాధికారి డాక్టర్ వీరేంద్ర హెగ్డే తెలిపారు. ఆయన శుక్రవారం ధర్మస్థలలో విలేకరులతో మాట్లాడారు. ఇన్ని రోజుల పాటు ధర్మస్థలపై ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో తనకు అర్థం కావటం లేదన్నారు. ధర్మస్థలపై వస్తున్న తప్పుడు ప్రచారంతో ప్రభుత్వం సిట్ని రచించి రాష్ట్ర ప్రజలకు నిజాలను తెలిసేలా చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ధర్మస్థల సంస్థచే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సేవ అనేది ప్రచార వస్తువు కాదన్నారు. ఇన్ని రోజుల పాటు ఆరోగ్యంగా ఉన్నానంటే దీనికి తన నిస్వార్థ సేవలు కారణమన్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. నేను అనేక పుస్తకాలను చదివాను. తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి శివకుమారస్వామి రచించిన పుస్తకాలను చదివాను. సేవ కంటే గొప్పది ఏమీ లేదని 108 ఏళ్లు బతికిన వ్యక్తి చెప్పిన మాటలు వాస్తవం అన్నారు.
ధర్మస్థలలో మృతదేహాల కోసం గాలింపు(ఫైల్)
ముసుగు వ్యక్తి చెన్నయ్యతో అధికారులు(ఫైల్)
వివాదిత ధర్మస్థల కేసుపై
డాక్టర్ పరమేశ్వర్తో చర్చ
కీలక ఆధారాలతో సహా
ప్రణబ్ మొహంతి వివరణ
తిమరోడి ఇంటికి
మూడో నోటీసు
ఆక్రమంగా ఇంటిలో తుపాకులు భద్రపరిచిన కేసులో పోరాటదారుడు మహేశ్ శెట్టి తిమరోడి ఇంటికి శుక్రవారం మూడో నోటీసును అంటించారు. తిమరోడి ఇంటిలో రెండు తల్వార్లు, ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై బెళ్తంగడి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు నోటీసును అంటించి వెళ్లారు. ఆయన విచారణకు హాజరు కాని కారణంగా బెళ్తంగడి పోలీసులు శుక్రవారం మూడో నోటీసును ఇంటి గోడకు అంటించి విచారణకు రావాలని కోరారు. ముందస్తు బెయిల్ కోసం మంగళూరు సెషన్స్ కోర్టులో పిటిషన్ వేయగా శనివారం విచారించనున్నారు.

హోంమంత్రితో సిట్ చీఫ్ భేటీ