
చెరువులోకి మురుగు నీరు చేరనీయొద్దు
రాయచూరు రూరల్: నగరంలోని మావినకెరె చెరువులోకి జనావాసాల నుంచి వచ్చే మురుగు నీరు కలవకుండా చూడాలని జిల్లాధికారి నితీష్ ఆదేశించారు. బుధవారం నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రోతో కలిసి ఆయన నగరంలోని చారిత్రక మావినకెరె చెరువుకు రూ.10 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లాడారు. ఇందిరా నగర్, ఐడీఎస్ఎంటీ కాలనీ ప్రజలు మురుగు నీటిని నేరుగా చెరువులోకి వదలడంతో నీరు కలుషితమవుతోందన్నారు. మురుగు నీరు చెరువులోకి రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యక్తి అదృశ్యం
హొసపేటె: బళ్లారి రైల్వే స్టేషన్ నుంచి ఈనెల 17న కలబుర్గి జిల్లా చించోళి తాలూకా బసంతపుర గ్రామానికి చెందిన రాహుల్ అనే 24 ఏళ్ల వ్యక్తి అదృశ్యమైన ఘటనపై బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. 5.8 అడుగుల ఎత్తు, గుండ్రని ముఖం, గోధుమ రంగు శరీరఛాయ, పలుచని శరీరాకృతి, నల్లటి జుట్టు, కళ్లపై తెల్లటి అద్దాలు కలిగి ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అతను అదృశ్యమైన సమయంలో నీలం రంగు టీ షర్ట్, నల్లటి నైట్ ప్యాంట్ ధరించాడు. ఈ వ్యక్తి ఆచూకీ గురించి ఏదైనా సమాచారం ఉంటే బళ్లారి రైల్వే పోలీస్ స్టేషన్ లేదా 08392–276063, 948080213 మొబైల్ నంబరులో సంప్రదించాలని రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ కోరారు.
పథకాల పనులు
త్వరగా పూర్తి చేయండి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో తాగునీటి రంగానికి ప్రాధాన్యత కల్పించాలని జిల్లా పంచాయతీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఈశ్వర్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకా యరగేరాలో జల జీవన్ పథకం పనులను, తాలూకాలో చేపట్టిన వివిధ తాగునీటి పథకాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. వారం రోజుల్లో జల జీవన్ పథకం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్య అవగాహన లేక పోవడంతో పనుల ఆలస్యానికి కారణం అవుతోందన్నారు. ఈ సందర్భంగా అధికారులు చంద్రశేఖర్, ఇంజినీర్లు, పీడీఓ, పంచాయతీ అధ్యక్షులు, సభ్యులున్నారు.
ముంపు ప్రాంతాల పరిశీలన
రాయచూరు రూరల్: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాలను నగరసభ కమిషనర్ జుబిన్ మహాపాత్రో పరిశీలించారు. బుధవారం నిజలింగప్ప కాలనీ, మడ్డిపేటె, బైరూన్ కిల్లా, తీన్ కందీల్, అరబ్ మొహల్లా, షియాతలాబ్, ఖాదర్గుండా, నవాబ్ గడ్డ తదితర ప్రాంతాలలో నీరు చేరిన స్థలాలను ఆయన తనిఖీ చేశారు. మురుగు కాలువల్లో నీరు సజావుగా వెళ్లడానికి చర్యలు చేపట్టాలన్నారు. అంబేడ్కర్ సర్కిల్ నుంచి బాబు జగ్జీవన్ రాం సర్కిల్ వరకు వరద నీరు సక్రమంగా ప్రవహించేలా అధికారులకు, సిబ్బందికి సలహా సూచనలను అదేశించారు. విద్యా భారతి రైల్వేస్టేషన్ వద్ద రోడ్డు కింది వంతెనలో నిల్వ చేరిన నీటి తొలగింపునకు చర్యలు చేపట్టాలని సూచించారు.
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
● నిందితుల్లో ఎమ్మెల్యే కారు డ్రైవర్
సాక్షి,బళ్లారి: ఓ హత్య కేసులో ఎమ్మెల్యే కారు డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 17వ తేదీన జానకల్ గ్రామానికి చెందిన ప్రసన్న అనే వ్యక్తి కనిపించక పోవడంపై చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు దర్యాప్తు చేసి, ఆలస్యంగా కేసు మిస్టరీని చేధించారు. ఈ హత్య కేసులో చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ ఎమ్మెల్యే గోవిందప్ప కారు డ్రైవర్ యశ్వంత్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సుబుదేంద్ర తీర్థ స్వామీజీకి తులాభారం
రాయచూరు రూరల్: మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్కు చాతుర్మాస దీక్షలో భాగంగా తులాభారం చేపట్టారు. మంగళవారం మంత్రాలయ మఠంలో విశేష పూజలతో పాటు చేపట్టిన దీక్షకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

చెరువులోకి మురుగు నీరు చేరనీయొద్దు

చెరువులోకి మురుగు నీరు చేరనీయొద్దు

చెరువులోకి మురుగు నీరు చేరనీయొద్దు

చెరువులోకి మురుగు నీరు చేరనీయొద్దు