
గురువులకు అనాదిగా గౌరవం
బళ్లారిటౌన్: పూర్వ కాలం నుంచి గురువులకు గౌరవం లభిస్తోందని, దీన్ని గురువులు గౌరవాన్ని కాపాడుకోవాల్సి ఉందని కమ్మరచేడు కళ్యాణ స్వామీజీ పేర్కొన్నారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో బసవేశ్వర నగర్ యోగా కేంద్రంలో ఏర్పాటు చేసిన గురువందన కార్యక్రమంలో నగరంలో వివిధ కేంద్రాల్లో పని చేస్తున్న యోగా ఉపాధ్యాయులను సన్మానించి మాట్లాడారు. యోగా మానవ జీవితంలో నిత్యవసర ప్రక్రియగా అలవరుచుకోవాలన్నారు. నేటి ఆధునిక జీవితంలో ఆహార పద్ధతుల వల్ల నానా రోగాలు ఉద్భవిస్తున్నాయన్నారు. నిత్యం యోగా చేయడం వల్ల రోగాల నుంచి దూరం కావచ్చన్నారు. కన్నడ చైతన్య వేదిక మహిళా అధ్యక్షురాలు జ్యోతి ప్రకాష్, ఆయుష్ అధికారి విరుపాక్షప్ప, పతంజలి జిల్లా అధ్యక్షుడు పంపనగౌడ, రాష్ట్ర సమితి సభ్యుడు ఇశ్వి పంపాపతి, నేతలు కప్పగల్ చేతన, మంజుల, ప్రభుకుమార్, విరుపాక్షప్ప, సంతోష్, ఎస్సీ పురాణిక్, రుద్రప్ప, సుమారెడ్డి, దొడ్డ బసప్ప, విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.
జేడీఎస్కు రాజీనామా.. కాంగ్రెస్లో చేరిక
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంచ గ్యారెంటీలు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీకి అందిస్తున్న సేవలను పరిగణలోకి తీసుకొని జేడీఎస్ పార్టీకి రాజీనామా చేసి తాను తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు జేడీఎస్ కార్యదర్శి దానప్ప యాదవ్ పేర్కొన్నారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరిక సమావేశంలో ఆయన మాట్లాడారు. కాగా దానప్ప యాదవ్ వంద మంది జేడీఎస్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శాంతప్ప, ఉపాధ్యక్షుడు సాజిద్ సమీర్, తిమ్మారెడ్డి, రమేష్, తేజప్ప, విశ్వనాథ్ పట్టి, హాజీ శాలం, శ్రీనివాసరెడ్డిలున్నారు.
మరమ్మతుల్లో జాప్యం.. రైతన్నకు శాపం
● క్రస్ట్గేట్లు సరిగా లేనందున టీబీ డ్యాం నుంచి 30 టీఎంసీల నీరు వృథా
హొసపేటె: తుంగభద్ర జలాశయంలో 19వ క్రస్ట్గేట్ తెగిపోయి ఏడాది గడిచింది. కొత్త క్రస్ట్గేట్ ఏర్పాటు చేయక పోవడంతో తుంగభద్ర జలాశయం నుంచి 30 టీఎంసీల నీరు అనవసరంగా నదిలోకి ప్రవహించింది. రాబోయే రోజుల్లో రైతులు తమ పంటలకు నీరు అందకుండా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి దుస్థితి ఏర్పడటం శాపం. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసి డ్యాం నిండినా రాబోయే రోజుల్లో రైతులు కచ్చితంగా నీటి కొరతను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా రైతులకు ఈ దుస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో చెరకు, వరి రైతులకు డ్యాం నుండి సాగునీరు అందడం గగనమేనని రైతులు మండిపడుతున్నారు.
ప్రేమించకుంటే
చంపుతామని బెదిరింపులు
హుబ్లీ: ఇద్దరు వ్యక్తులు తమను ప్రేమించాలని ఒత్తిడి చేస్తూ తాను స్కూటీపై వెళుతుండగా అడ్డుకొని చేతులు పట్టుకొని లాగి చంపేస్తామని బెదిరించినట్లు ఓ వివాహితురాలు కేశ్వాశ్వపుర పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాగశెట్టికొప్ప చెరువు వద్ద ఆ ఇద్దరు తన చేతులు పట్టుకొని లాగారని శబరినగర హుస్సేన్సాబ్, శ్రీరామనగర శ్రీనివాస్లపై ఆమె ఫిర్యాదు చేశారు. గతంలో పెట్రోల్ బంక్లో పని చేస్తుండగా నిందితుడు పరిచయం కావడంతో ఆమె మొబైల్ నెంబర్ తీసుకున్నాడు. ఈ చొరవను దుర్వినియోగం చేసుకొని తనను నిత్యం ప్రేమించాలని వేధించేవాడని, ఈనేపథ్యంలో అతడి ఫోన్ నెంబర్ను బ్లాక్ లిస్ట్లో పెట్టాను. ఆ తర్వాత అతడి స్నేహితుడు శ్రీనివాస్ తనకు ఫోన్ చేసి హుస్సేన్సాబ్ను ప్రేమించక పోతే నిన్ను చంపుతానంటూ బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఆదివారం సాయంత్రం స్కూటీలో పని నుంచి ఇంటికి వెళుతుండగా ఆ ఇద్దరూ తనను అడ్డగించి తన పరువు పోయే రీతిలో నడుచుకున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. అలాగే మరో ఘటనలో కొత్త బస్టాండ్లో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ చోరీ చేస్తుండగా ఏపీలోని రాజమండ్రికి చెందిన రవితేజ(20) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.47 వేల విలువ చేసే మొబైల్ ఫోన్లను జప్తు చేసి కేసు దర్యాప్తు చేపట్టినట్లు గోకుల్ రోడ్డు పోలీసులు తెలిపారు.

గురువులకు అనాదిగా గౌరవం

గురువులకు అనాదిగా గౌరవం