
రూ.936 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలో రూ.936 కోట్లతో అభివృద్ధి పనులకు సోమవారం సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శ్రీకారం చుట్టారు. జిల్లాలోని యరగేర వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. సిద్దరామయ్య ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కార్ 15వ ఆర్థిక ప్రణాళికలో రాష్ట్రానికి కేటాయించిన రూ.80 వేల కోట్లను నేటికి కూడా రాకుండా నిలుపుదల చేశారని ఆరోపించారు. రూ.111 కోట్లతో బీటీ రోడ్లు, రూ.289 కోట్లతో నీటి పథకాలు, రూ.152 కోట్లతో బ్రిడ్జి కం బ్యారేజీలను నిర్మించనున్నారు. 80 వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గిరిజన ఉత్సవాలను ప్రారంభించి, రాయచూరు ఆదికవి మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం పేరున శిలాశాసనాన్ని ఆవిష్కరించారు. 203 మంది లబ్ధిదారులకు పలు సంక్షేమ పథకాల ద్వారా చేయూతనిచ్చారు. కల్యాణ కర్ణాటక పరిధిలో రాజ్యాంగం నుంచి జారీ చేసిన ఆర్టికల్–371(జే) అమలై దశాబ్దం కానున్న తరుణంలో సీఎం, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను అభినందించారు. సమావేశంలో మంత్రులు జార్జ్, మహదేవప్ప, సతీష్ జార్కిహొళి, శరణ ప్రకాష్ పాటిల్, సుధాకర్, శరణ బసప్ప దర్శనాపూర్, బోసురాజు, ఎంపీ కుమార నాయక్, ఎమ్మెల్సీ వసంత్ కుమార్, శరణే గౌడ, చంద్రశేఖర్ పాటిల్ గుత్తేదార్, గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్, శాసన సభ్యులు హంపయ్య నాయక్, హంపనగౌడ బాదర్లి, జిల్లాధ్యక్షుడు బసవరాజ పాటిల్, కరీం, అస్లాంపాషా, రాజశేఖర్ రామస్వామిలున్నారు.

రూ.936 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం