
ఆనేకల్లో భారీ వర్షం
బొమ్మనహళ్లి : బెంగళూరు నగర జిల్లా ఆనేకల్ తాలూకాలో ఈదురు గాలులతో కూడిన వర్సం బీభత్సం సృష్టించింది. ఆదివారం రాత్రి జల్లులతో ప్రారంభమైన వర్షం సోమవారం వేకవజాము వరకు ఏకధాటిగా కురిసింది. ఆనేకల్ పట్టణంలో రోడ్లు జలమయం అయ్యాయి. తాలూకాలోని గ్రామాల్లో వంకలు, వాగులు ఏరులై ప్రవహించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మంత్రి జమీర్ ఇంటి ముట్టడికి యత్నం
శివాజీనగర: గృహనిర్మాణ శాఖ మంత్రి జమీర్ అహమ్మద్ ఇంటి ముట్టడికి కన్నడ పోరాటకులు రూపేశ్ రాజణ్ణ యత్నించగా పోలీసులు భగ్నం చేశారు. రూపేశ్ రాజణ్ణపై మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సన్నిహితుడు సర్ఫరాజ్ ఖాన్ ఇటీవల తీవ్ర ఆరోపణ చేశారు.దీంతో ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తూ రూపేశ్ రాజన్న మంగళవారం తన అనుచరులతో కలిసి జమీర్ ఇంటి ముట్టడికి యత్నించగా పోలీసులు రంగ ప్రవేశం చేసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేపేశ్ రాజణ్ణ అనుచరులను అరెష్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
పార్కింగ్ విషయంలో గొడవ
● ఇద్దరికి గాయాలు
మైసూరు : బస్టాండ్లో వాహనాల పార్కింగ్ విషయంలో గొడవ జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరు బస్టాండ్లో జరిగింది. హుణసూరు కేఎస్ఆర్టీసీ బస్టాండ్లో ప్రజలు దర్జాగా తమ వాహనాలను నిలిపి బస్సుల సంచారానికి ఆటంకం కల్గిస్తున్నారు. ఈనేపథ్యంలో ఇక్కడ వాహనాన్ని నిలపవద్దని ఓ వ్యక్తికి ఆర్టీసీ సిబ్బంది సూచించారు. ఆ సమయంలో మాటామాటా పెరిగి పరస్పరం చేయి చేసుకున్నారు. గొడవలో ఇద్దరికీ గాయాలయ్యాయి. జోక్యం చేసుకున్న గ్రామీణ పోలీసులు ఇద్దరినీ చికిత్స కోసం ఆస్పత్రికి పంపించారు.
వాహనం ఢీకొని జింక మృతి
శివమొగ్గ : వాహనం ఢీకొని జింక మృతి చెందింది. శివమొగ్గ జిల్లా సొరభ హళెసోరభలోని గౌరికేరె మఠం సమీపంలో తవనంది రోడ్డులో జింక కళేబరం పడి ఉండగా మంగళవారం ఉదయం స్థానిక రైతులు గమనించారు. అటవీశాఖ అధికారులు వచ్చి పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లు నిర్ధారించారు. కళేబరాన్ని అక్కడే ఖననం చేయించారు.
జీపీ సభ్యుడి
అనుమానాస్పద మృతి
దొడ్డబళ్లాపురం: గ్రామ పంచాయతీ సభ్యుడు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటన చెన్నపట్టణ తాలూకా మాకళి గ్రామంలో చోటుచేసుకుంది. మాకళి గ్రామపంచాయతీ సభ్యుడు లోకేశ్(45) గ్రామ శివారులో విగతజీవిగా పడి ఉండగా స్థానికులు గమనించి ఎంకే దొడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పరిశీలించారు. మృతదేహం పక్కనే విషం బాటిల్ లభించింది. ఆయనకు సంబంధించిన కారు అక్కడే నిలిపి ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆస్పత్రికి తరలించారు. లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేసారా ?అనేది దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
యువతి పట్ల పోకిరీల వికృత చేష్టలు
బొమ్మనహళ్లి : సరుకుల కోసం దుకాణానికి వెళ్లిన యువతి పట్ల గంజాయి మత్తులో ఉన్న యువకులు అసభ్యకంగా, లైంగికంగా వేధించారు. ఈఘటన ఆనేకల్ తాలూకా మైలసంద్రలో ఆదివారం జరిగింది. చైన్నెకి చెందిన ఓ యువతి వారం రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి రేణుకా యల్లమ్మ లౌఔట్లో అద్దె ఇంటిలో ఉంటోంది. ఆదివారం సాయంత్రం సరుకుల కోసం కిరాణా దుకాణానికి వెళ్లిన సమయంలో రిచర్డ్(24), ఆంథోని(52) అనే వ్యక్తులు ఆ యువతిని అసభ్యకరంగా తాకారు. యువతి వారినుంచి తప్పించుకొని ఇంటికి రాగా ఆ ఇద్దరు వ్యక్తులు వెంటాడి గొడవ చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ ఇద్దరూ అసభ్యంగా దూషించారు. ఒక జిమ్ట్రైనర్ మందలించగా అతనిపై కూడా దాడికి యత్నించారు. సహనం కోల్పోయిన స్థానికులు బాధిత యువతి కుటుంబ సభ్యులతో కలిసి బన్నేరుఘట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించి నిందితులను అరెస్ట్ చేశారు.

ఆనేకల్లో భారీ వర్షం