
మాట్లాడకండి.. బుజ్జగిస్తాం
శివాజీనగర: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి విరుద్ధంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే బహిరంగంగా ఆరోపణలు చేయడం మీద పార్టీ హైకమాండ్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ముందు ఏ ఎమ్మెల్యే కూడా బహిరంగంగా మాట్లాడరాదని ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంగళ, బుధవారం ఢిల్లీలో హైకమాండ్ నాయకులను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల్లేవు, గృహ నిర్మాణశాఖలో ముడుపుల గోల, మంత్రులు మమ్మల్ని ఖాతరు చేయడం లేదు అని ఎమ్మెల్యేలు పలు రకాలుగా రభస చేయడం మీద ఢిల్లీ నాయకులు ఆరా తీశారు. మంత్రి పదవులు రాలేదని, నామినేటెడ్ పోస్టులు రాలేదని కొందరు ఆక్రోశంగా ఉన్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేయటం సరికాదు. ఇది ప్రతిపక్షాలకు అస్త్రం అందజేసినట్లవుతోంది. ప్రభుత్వానికి గౌరవం లేకుండా పోతుంది, అందుచేత ఎలాంటి సమస్యలున్నా దానిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని హైకమాండ్ స్పష్టంచేసినట్లు సూచించినట్లు తెలిసింది. గతంలో సీఎం పదవి గురించి కూడా నేతలు తలోరకంగా మాట్లాడడంతో ఇలాగే కట్టడి చేయడం తెలిసిందే.
అసంతృప్తే అజెండాగా
ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్తో సీఎం గంటపాటు చర్చించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అసంతృప్తి మీద ఎక్కువ చర్చ సాగింది. వారితో మాట్లాడి కోపాన్ని చల్లార్చాలని తీర్మానించారు. మంత్రులు హెచ్.సీ.మహదేవప్ప, సతీశ్ జార్కిహొళి, కే.జే.జార్జ్ తదితరులు సీఎంతో ఉన్నారు. అలాగే ఎమ్మెల్సీ స్థానాల భర్తీ, వీలైతే మంత్రిమండలి విస్తరణ గురించి మల్లికార్జున ఖర్గే తదితరులతో మంతనాలాడారని సమాచారం.
ఎమ్మెల్యేలతో సీఎం భేటీలు?
హైకమాండ్ సూచనల ప్రకారం సీఎం బెంగళూరుకు చేరుకోగానే అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడి బుజ్జగించనున్నారు. విడతలవారీగా సమావేశాలు జరుపుతారు. మొదట అళంద ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ను పిలిచే అవకాశముంది. ఇళ్ల కేటాయింపుల్లో అవినీతి అని ఆయనే రచ్చ చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు
హైకమాండ్ ఆదేశం
ఢిల్లీలో సీఎం సిద్దు సుదీర్ఘ చర్చలు

మాట్లాడకండి.. బుజ్జగిస్తాం