
నాణ్యతగా నిర్మాణం వల్లే ప్రారంభం జాప్యం
బళ్లారి అర్బన్: గడిగి చెన్నప్ప సర్కిల్ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టడం వల్లే ప్రారంభంలో జాప్యం జరిగిందని, మరే ఇతర కారణాలు లేవని నగర ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి తెలిపారు. బుధవారం సలాం బళ్లారి అభియాన్లో భాగంగా 16వ వార్డు శ్రీరాంపురం కాలనీలో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న గడిగి చెన్నప్ప సర్కిల్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేస్తే తర్వాత సమస్యగా మారరాదన్న ఉద్దేశంతోనే నిర్మాణ పనుల్లో నాణ్యతకు పెద్ద పీట వేశామన్నారు. రెండు నెలల్లో పనులు పూర్తి అవుతాయి. స్థానికులు ఈ విషయంలో సహకరించాలన్నారు. సీఎం, డీసీఎంలను పిలిచి సదరు సర్కిల్ను ప్రారంభిస్తామన్నారు. తాగునీటి పథకం, రోడ్లు, మసీదులు, మందిరాలు, అంతర్గత భూగర్భ డ్రైనేజీ తదితర కొన్ని నిర్మాణ పనులకు సీఎం, డీసీఎం, జిల్లా ఇన్చార్జి మంత్రి తగిన నిధులు ఇచ్చారన్నారు. సలాం బళ్లారి అభియాన్కు ప్రజల నుంచి చక్కటి స్పందన లభిస్తోందన్నారు. మాజీ మేయర్ రాజేశ్వరి, జబ్బార్, నూర్ మహమ్మద్, పార్టీ నేతలు సుబ్బారాయుడు, మంజుల, హొన్నప్ప, హగరి గోవింద తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నారా భరత్రెడ్డి