
గంగాభవానీ నమోస్తుతే
చింతామణి: ఆషాడ మాస మోదటి బుధవారం సందర్భంగా పట్టణంలో ఆరాధ్య శక్తి అయిన గంగాభవానీ ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకులు సురేష్ అభిషేకం, అలంకారం, అర్చన చేపట్టారు. పెద్దఎత్తున భక్తులు దర్శించుకొన్నారు.
ఇంటి లాకర్లో నగలు మాయం
మైసూరు: నగరంలోని బోగాది 2వ స్టేజ్ నివాసి క్షమా అనే వైద్యురాలి ఇంట్లో అనూహ్య చోరీ జరిగింది. ఇంటి లాకర్లో ఉంచిన రూ.17.75 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు. డాక్టర్ క్షమకు పెళ్లి సమయంలో తండ్రి 326 గ్రాముల బంగారు ఆభరణాలను చేయించి ఇచ్చారు. తరువాత క్షమ దంపతులు 128 గ్రాముల బంగారు నగలను చేయించుకుని వాటిని ఇంటి పడక గదిలోని సేఫ్ లాకర్లో భద్రపరిచారు. దానిని తెరిచే పాస్వర్డ్ దంపతులకు మాత్రమే తెలుసు. ఇటీవల లాకర్లో సమస్య రావడంతో కంపెనీ సిబ్బంది ద్వారా మరమ్మతు చేయించారు. తర్వాత లాకర్ను పరిశీలించగా నగలు లేవు. మరమ్మతులకు వచ్చిన సిబ్బందే మాయం చేసినట్లు అనుమానాలున్నాయి. సరస్వతీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దర్జాగా గంధపు చెట్టు చోరీ
మండ్య: సినిమాలో ఎర్ర చందనం దొంగల మాదిరిగా, నలుగురు దుండగులు గంధపు చెట్టును నరికి ఎత్తుకెళ్లారు. తాలూకాలోని కిరంగూరు గ్రామానికి చెందిన చంద్రకాంత్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని గంధపు చెట్టును దుండగులు నరికి, అక్కడే దుంగలుగా కత్తిరించి భుజానికెత్తుకుని మోసుకెళ్లారు. ఈ దృశ్యాలు ఎదురింటి వారు అమర్చిన సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఇళ్లు, ఆఫీసుల ఆవరణలోని గంధపు చెట్లను దొంగలు ఎత్తుకెళ్లడం అధికమైంది. గతంలో నదీ తీరంలో చేపలు పట్టేందుకు వచ్చిన కొందరు చుట్టుపక్కల గంధపు చెట్లను నరుక్కొని వెళుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పట్టణ సీఐ బీజీ కుమార్ స్థానికుల నుంచి వివరాలు సేకరించి దొంగలను పట్టుకుంటామని తెలిపారు.
ఆగిన 9వ తరగతి
బాలిక గుండె
దొడ్డబళ్లాపురం: రాష్ట్రంలో ఆకస్మిక గుండెపోట్లతో యువత, బాలలు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. 9వ తరగతి బాలిక చనిపోయిన ఘటన బెళగావి జిల్లా అథణి తాలూకా చమకేరి గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. విద్యార్థిని రేణుక (15) గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలో ఆటమైదానంలో ఆడుకుటూ కుప్పకూలి పడిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలో కన్నుమూసింది. గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఐగళి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
జైశ్రీరాం అనాలని దాడి?
శివాజీనగర: జై శ్రీరాం అనాలని దాడి చేశారని ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదుచేశారు. బెంగళూరులో జూన్ 22న సంపిగెహళ్లి పోలీస్ స్టేషన్ పరిధి హెగ్డే నగర ఏజెబీజే మైదానం వద్ద ఖాళీ స్థలం వద్ద ఈ ఘటన జరిగింది. ఓ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉండగా, మరో వర్గానికి చెందిన ఎనిమిది మంది మద్యం మత్తులో గొడవకు వచ్చారు, దాడి కూడా చేశారని బాధితులు చెబుతున్నారు. తమను జై శ్రీరామ్ అని చెప్పాలని ఒత్తిడి చేయగా, నిరాకరించినట్లు తెలిపారు. దీంతో వారు కొట్టడంతో ఒకరికి కుడి చెవిలో గాయాలైనట్లు చెప్పారు. పోలీసులు స్పందిస్తూ, జై శ్రీరాం నినాదాలు చేయాలని ఒత్తిడి చేయలేదని తెలిపారు.
కన్నడలోనే పరిపాలన: సర్కారు
శివాజీనగర: పరిపాలనలో అన్ని శాఖల్లో కూడా పూర్తి స్థాయిలో కన్నడ భాషను ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ని శాఖల కార్యాలయం నామఫలకాలు, రికార్డులు కన్నడలోనే ఉండాలి. దరఖాస్తు, లేఖలకు కన్నడలోనే సమాధానం చెప్పాలి. శాసనసభా కార్యకలాపాలు, పత్రాల లావాదేవీలు కన్నడలోనే ఉండాలని స్పష్టం చేసింది. భాషా విధానాన్ని అమలు చేయడం అధికారులు, ఉద్యోగుల బాధ్యత. విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్ సంఘ–సంస్థలతో పాటుగా అందరు అధికారులు, ఉద్యోగులు కట్టుదిట్టంగా నియమాలను పాటించాలి. ఉల్లంఘించిన వారి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోబడునని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్ తెలిపారు.

గంగాభవానీ నమోస్తుతే