
టీచర్ దండనకు బాలిక బలి
యశవంతపుర: యూనిఫారం ధరించలేదని ఉపాధ్యాయురాలు మందలించినందుకు విద్యార్థిని భయపడి పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం చిక్కమగళూరు జిల్లా తరీకెరె తాలూకా లింగదహళ్లిలో సర్కారీ బడిలో జరిగింది. నివేదిత (13) మృతురాలు. బాలికకు సర్కారు సరఫరా చేసిన యూనిఫారాన్ని ఇచ్చారు. ఈ నెల 23 నుంచి తప్పనిసరిగా యూనిఫారం ధరించి రావాలని సూచించారు. అయితే బట్టను కుట్టడానికీ టైలర్కు ఇచ్చారు. టైలర్ యూనిఫారంను ఇవ్వని కారణంగా విద్యార్థిని మామూలు దుస్తులు వేసుకుని వచ్చింది. అది చూసి ఓ టీచర్ బాలికను దండించింది. మళ్లీ ఇలా వస్తే కొడతామని బెదిరించింది. దీంతో భయాందోళనకు గురైన చిన్నారి ఇంట్లో పురుగుల మంది తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. తరీకేరె పోలీసులు కేసు విచారిస్తున్నారు. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. బాలిక చావుకు కారణమైన టీచరును శిక్షించాలని కోరారు.