
కొండచరియలు విరిగి.. ముప్పు తప్పింది
యశవంతపుర: కశ్మీరు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 13 మంది కన్నడిగులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. వీరు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి అడ్డు పడడంతో ముందుకు వెళ్లలేకపోవడం ప్రాణాలను నిలిపింది. వేసవి సెలవులు కావడంతో బాగలకోట మార్వాడీ వీధికి చెందిన కిశోర్ కాసట్ అనే వ్యాపారి బంధువులతో కలిసి 13 మంది ఈ నెల 19న జమ్ము కశ్మీర్కు వెళ్లారు. వైష్ణోవిదేవి ఆలయాన్ని దర్శించుకుని మంగళవారం పహల్గామ్కి బయల్దేరారు. ఆ మార్గ మధ్యలో కొండచరియలు విరిగి పడిన కారణంగా 70 కిలోమీటర్లు తిరిగి మరో మార్గంలో ఆలస్యంగా వెళ్లవలసి వచ్చింది. ఇంతలో ఉగ్రవాదుల దాడి చేశారని బాగలకోట నుంచి కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వటంతో వెనుదిరిగినట్లు తెలిపారు. శ్రీనగర్కు క్షేమంగా చేరుకున్నట్లు తెలిపారు.
హావేరి దంపతుల అదృశ్యం
కశ్మీరు పర్యటనకు వెళ్లిన హావేరి దంపతుల ఆచూకీ లభించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శిగ్గావికి చెందిన నాగరాజు దంపతులు ముంబై నుంచి విమానంలో కశ్మీర్కు వెళ్లారు. వారి ముబైల్ ఫోన్ స్విచాఫ్ అని వస్తోందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు శిగ్గావి పురసభలో ఉద్యోగి, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీరు కశ్మీర్కు వెళ్లారు. కుటుంబీకులు హావేరి జిల్లా కలెక్టర్కు సమాచారం ఇచ్చారు.
న్యాయం జరగాలన్న సినీలోకం
కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించడంపై సినిమా, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటులు శివరాజ్కుమార్, కిచ్చ సుదీప్, యశ్, ధ్రువ సర్జా, నటి రాధికా పండిత్లు ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. గుండె చలించిందని, ఉగ్రవాదులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్ ఎన్నటికీ మనదేన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని అన్నారు.
బాగల్కోట యాత్రికులు సురక్షితం

కొండచరియలు విరిగి.. ముప్పు తప్పింది