
మాతృభాషను ఆదరించాలి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో మాతృభాషను ఆదరించాలని విధాన పరిషత్ సభ్యుడు శశీల్ నమోషి పిలుపు ఇచ్చారు. సోమవారం కలబుర్గిలో హైదరాబాద్ కర్ణాటక విద్యా సంస్థకు చెందిన వీరమ్మ గంగసిరి మహిళా కళాశాలలో విద్యార్థులకు రెండు వారాల పాటు హిందీ భాషను నేర్పేందుకు ఏర్పాటు చేసిన తరగతులను ప్రారంబించి మాట్లాడారు. కన్నడ భాషకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యోగేంద్ర మిశ్రా, రణజిత్, రాజేంద్ర కొండా, ప్రేమ చంద్ర, అంజలి, రామలింగ, మహేష్, దయానంద, కవిత, సుష్మాలున్నారు.
దొంగ అరెస్ట్
హుబ్లీ: కార్వార రోడ్డులో నిలిపిన గూడ్స్ వాహనంలోని మూడు బైక్లతో పాటు మొత్తం రూ.15.50 లక్షల విలువ చేసే గృహ వినియోగ వస్తువులు చోరీ చేయగా సదరు నిందితుడిని అరెస్ట్ చేయడంలో పాత హుబ్లీ పోలీసులు సఫలీకృతులయ్యారు. జిల్లాలోని కుందగోళ తాలూకా రామనకొప్ప విఠల కురడి(27) అరెస్ట్ అయిన నిందితుడు. ఇద్దరు సైనికులకు చెందిన బైక్లు, గృహ వినియోగ వస్తువులను చైన్నె నుంచి గోవాకు వాహనంలో తరలిస్తున్నారు. ఈనెల 17న రాత్రి 10.30 గంటలకు బైపాస్ రోడ్డులో వాహనం పార్క్ చేసి డ్రైవర్ భోజనానికి వెళ్లినప్పుడు నిందితుడు చోరీ చేశాడు. ఈ ఘటనపై పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఏసీపీ ఉమేష్ చిక్కమఠ సారథ్యంలో చురుగ్గా గాలింపు చేపట్టిన సీఐ ఎంఎల్ సింధూర బృందం నిందితుడిని చోరీ వస్తువులతో పాటు అదుపులోకి తీసుకున్నారు. ఈ గాలింపు బృందంలో ఎస్ఐ తాతన్నవర, విశ్వనాథ, సిబ్బంది కాళె, అభయ, బసవరాజ, రమేష్, కాళనగౌడ తదితరులు ఉన్నారు.
మామిడికాయలు వదిలి పరారీ
కాగా మరో ఘటనలో వేబ్రిడ్జి పైనే మామిడి కాయలు విడిచి వెళ్లిన వైనం వెలుగు చూసింది. మామిడి పండ్లను చోరీ చేసి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వ్యాపారస్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దొంగలు వేబ్రిడ్జిపైనే మామిడి కాయలను వదిలి పరారయ్యారు. ధార్వాడ కెళగేరి గుడ్డదమఠ వేబ్రిడ్జి వద్దకు తూకం చేయడానికి ముగ్గురు 5, 6 బస్తాల్లో 5 క్వింటాళ్ల మేర మామిడి పండ్లను తెచ్చారు. ఇంకా హోల్సేల్ మామిడి పండ్ల అంగడి తెరవలేదు. ఇప్పుడే ఎందుకు కాయలు తెచ్చారని అనుమానంతో గ్రామస్తులు ప్రశ్నించగా దొంగలు ఎక్కడ పట్టుబడతామన్న భయంతో సమాధానం ఇవ్వకుండానే తాము తెచ్చిన సరుకును అక్కడే వదిలేసి పరారయ్యారు.
అధికారులపై చర్యలకు వినతి
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్రాహ్మణులను అవమానించేలా ప్రవర్తించిన అధికారులపై చర్యలు చేపట్టాలని అఖల కర్ణాటక బ్రాహ్మణ మండలి మహా సభ డిమాండ్ చేసింది. సోమవారం మాన్వి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అధ్యక్షుడు విజయ కుమార్ మాట్లాడారు. సీఈటీ పరీక్షలు రాయడానికొచ్చిన బ్రాహ్మణ విద్యార్థులను అవమాన పరిచేలా నడుచుకున్న అధికారులను విధుల నుంచి తొలగించాలన్నారు. సమాజంలో సంప్రదాయాలను కాదని పరీక్షలు రాసే సమయంలో వంటిపై ఉన్న జంధ్యాన్ని తొలగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
న్యాయవాదుల ఆందోళన
రాయచూరు రూరల్: బెంగళూరు న్యాయవాది సదాశివరెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఉపాధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఈనెల 16న న్యాయవాది సదాశివరెడ్డి కార్యాలయంలోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ఆయనపై దాడి చేసి గాయపరిచారన్నారు. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు అధికమయ్యాయని, తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్కు జిల్లాధికారి నితీష్కు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మప్ప, జగదీష్, మున్నా, వీరభద్రప్ప, రాజ్ కుమార్, శివకుమార్, సంగప్ప, గిరీష్, ఓంకార్లున్నారు.
బావిలో ఈతకు వెళ్లి
ఇద్దరు బాలుర దుర్మరణం
రాయచూరు రూరల్: బావిలో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు దుర్మరణం పాలైన ఘటన బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బసవ కళ్యాణ తాలూకా ముచళంబ్లో జరిగింది. మృతులను ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన అవినాష్(16), బాగేష్(16)లుగా పోలీసులు గుర్తించారు. పాఠశాలకు సెలవులు వదలడంతో స్నేహితులతో కలసి బావిలో ఈత కోసం వెళ్లిన ఇద్దరు బాలురు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మాతృభాషను ఆదరించాలి

మాతృభాషను ఆదరించాలి

మాతృభాషను ఆదరించాలి