బస్సును అడ్డుకున్న ఏనుగు | - | Sakshi
Sakshi News home page

బస్సును అడ్డుకున్న ఏనుగు

Apr 19 2025 9:34 AM | Updated on Apr 19 2025 9:34 AM

బస్సు

బస్సును అడ్డుకున్న ఏనుగు

కెలమంగలం: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఏనుగు అడ్డుకున్న ఘటన తమిళనాడు – కర్ణాటక సరిహద్దు ఆనేకల్‌ సమీపంలో జరిగింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు కే.ఆర్‌.పుర ప్రాంతం నుంచి గురువారం సాయంత్రం ప్రయాణికులతో కగ్గలీపురకు బయల్దేరింది. గుల్లట్టి ప్రాంతం వద్ద రోడ్డుకు అడ్డంగా వచ్చిన ఏనుగు బస్సును అడ్డగించింది. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో కేకలు వేశారు. డ్రైవర్‌, కండెక్టర్‌ విషయాన్ని అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు. అటవీశాఖ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగును బన్నేరుగట్ట అటవీ ప్రాంతానికి మళ్లించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొన్నారు.

బస్సుల్లో పొగాకు

ప్రకటనలపై నిషేధం

బనశంకరి: కేఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో పొగాకు, సిగరెట్‌, మద్యం ఉత్పత్తుల ప్రకటనలను నిషేధించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు అందాయి. ఈమేరకు లైసెన్సుదారులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సుల్లో పొగాకు, సిగరెట్‌, మద్యం ఉత్పత్తులు ప్రకటనలను పూర్తిగా తొలగించాలని ఓ వ్యక్తి ఎక్స్‌ ద్వారా ప్రభుత్వానికి మనవిచేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అలాంటి ప్రకటనలు తొలగించాలని సీఎం కార్యాలయ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాక బస్సుల్లో అమర్చిన కూల్‌లిప్‌ ప్రకటనలను తొలగించడానికి చర్యలు తీసుకున్నారు.

కట్నం వేధింపులకు

మహిళ బలి

యశవంతపుర: కట్నం వేధింపులకు మహిళ బలైంది. కట్నం తీసుకురావాలని అత్తంటివారు ఒత్తిడి చేస్తుండటంతో వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హాసన్‌ జిల్లా ఆలూరు తాలూకా కణదహళ్లి గ్రామంలో జరిగింది. హళేపాళ్యకు చెందిన రక్షిత(21) అనే యువతి, కణదహళ్లికి చెందిన పునీత్‌లు మూడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కాగా పెళ్లయినప్పటినుంచి కట్నం కోసం అత్తింటివారు వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేక మనో వేదనకు గురైంది. ఈక్రమంలో గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆలూరు గ్రామాంతర పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సామూహిక అత్యాచారంపై విచారణ వేగవంతం

యశవంతపుర: మంగళూరులో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుకు సంబంధించి ఉళ్లాల పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేశారు. యువతిని డ్రాప్‌ చేస్తామనే సాకుతో ఆమైపె అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఆటో డ్రైవర్‌తో పాటు అతడి ఇద్దరు స్నేహితులు కలిసి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువతి ఉద్యోగం కోసం కేరళలోని ఉప్పళకు వెళ్లారు. అక్కడ స్నేహితులతో గొడవ పడి అర్థరాత్రి మంగళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్‌ సాయం కోరడంతో అప్పుడు ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు తాగిన మత్తులో ఎవరూ లేని చోటకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు.

తుంగభద్రలో మునిగి

ఇద్దరు దుర్మరణం

మృతులు బెంగళూరు వాసులు

రాయచూరు రూరల్‌: తుంగభద్ర నదిలో స్నానానికి దిగి ఇద్దరు దుర్మరణం పాలైన ఘటన శుక్రవారం రాయచూరు తాలూకా బిచ్చాలిలో చోటు చేసుకుంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం ముగించుకొని బిచ్చాలిలో వెలసిన అప్పణాచారి కట్ట, ఏకశిలా బృందావనం తిలకించడానికి వచ్చిన బెంగళూరు వాసులు నదిలో స్నానం చేయడానికి వెళ్లారు. నది మధ్యలో పాయ ఉండడంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించి నీట మునిగి ప్రాణాలు వదిలారు. మృతులను బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లి తాలూకా చినవండనహళ్లి ముత్తురాజ్‌ (23), మదన్‌(20 )లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించినట్లు యరగేర పోలీసులు తెలిపారు.

బస్సును అడ్డుకున్న ఏనుగు 1
1/3

బస్సును అడ్డుకున్న ఏనుగు

బస్సును అడ్డుకున్న ఏనుగు 2
2/3

బస్సును అడ్డుకున్న ఏనుగు

బస్సును అడ్డుకున్న ఏనుగు 3
3/3

బస్సును అడ్డుకున్న ఏనుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement