బాబూజీ, అంబేడ్కర్‌ జయంతుల ఆచరణకు నిర్ణయం | - | Sakshi
Sakshi News home page

బాబూజీ, అంబేడ్కర్‌ జయంతుల ఆచరణకు నిర్ణయం

Mar 22 2025 1:34 AM | Updated on Mar 22 2025 1:28 AM

హొసపేటె: హరిత విప్లవ పితామహుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఏప్రిల్‌ 5న నగరంలోని బాబూజీ ప్రతిమకు పూలమాల వేసి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని ఏప్రిల్‌ 14న ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోందని జిల్లాధికారి ఎంఎస్‌ దివాకర్‌ తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి ముందస్తు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండేళ్లుగా జయంతులను సరళంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈసారి జిల్లా యంత్రాంగం వివిధ సంస్థల సహకారంతో ఘనంగా వేడుకలకు సిద్ధమైందన్నారు. ఏప్రిల్‌ 5న నగరంలోని డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ సర్కిల్‌లో ప్రతీకాత్మకంగా జయంతిని జరుపుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ 14న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతితో పాటు బాబూజీ జయంతిని జరుపుదాం. నగరంలోని జంబునాథ్‌ టెంపుల్‌ రోడ్డులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌ నుంచి జై భీమ్‌ సర్కిల్‌ వరకు ఇద్దరు మహానుభావుల చిత్రపటాలతో వివిధ సంగీత వాయిద్యాలు, కళాబృందాల మధ్య భారీ ఊరేగింపు నిర్వహిస్తారన్నారు. జయంతుల సందర్భంగా నగరంలోని ప్రధాన వీధులు, రౌండ్‌ అబౌట్లు విద్యుత్‌ దీపాలతో అలంకరించాలి. అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు జయంతిని తప్పనిసరిగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు జయంతుల్లో తప్పకుండా పాల్గొనాలన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ హరిబాబు, అదనపు జిల్లాధికారి బాలకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ వివేకానంద తదితరులు పాల్గొన్నారు.

బాబూజీ, అంబేడ్కర్‌ జయంతుల ఆచరణకు నిర్ణయం1
1/1

బాబూజీ, అంబేడ్కర్‌ జయంతుల ఆచరణకు నిర్ణయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement