మానకొండూర్: ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాల్సిన అసవరం ఉందని విద్యా కమిషన్ మాజీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘విద్యా బస్సుయాత్ర’ గురువారం మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గంగిపల్లిలోని శ్రీసరస్వతి విద్యాలయం, చెంజర్ల ప్రాథమిక పాఠశాల, గట్టు దుద్దెనపల్లి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాలల పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య, కనీస వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. కనీస సౌకర్యాలతో పాటు ఎలాంటి ప్రమాణాలు ఉండాలో 52 అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు వెల్లడించారు. మన స్కూళ్లలో ఐరోపా (యూరోపియన్) స్థాయి సౌకర్యాలు కల్పించడం అసాధ్యమేమీ కాదని, సరిగ్గా ప్రణాళికలు రచిస్తే ఇది సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులకు తగిన గ్రేడింగ్ విధానం అమలు చేయాలని సూచించారు. సర్కారు బడుల రూపురేఖలు మార్చకుంటే భవిష్యత్లో సీఎం నివాసాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రొఫెసర్ పద్మ, డాక్టర్ ఎంవీ రెడ్డి, ఎం.చంపాలాల్, రుబీనా, టి.నిర్మల, అశోక్కుమార్, ఎం.కుమార్, నిఖిల్, విజయ్, కృష్ణ, రాజ్కుమార్ పాల్గొన్నారు.


