అంగడి(సంత) నుంచి వస్తూ రోడ్డు దాటలేక పిల్లలు అయోమయంగా నిలబడ్డారు.
తాతయ్య: ‘ఏంట్రా ఆగిపోయారు?’
బన్నీ అన్నాడు.. ‘తాతయ్యా, కార్లు,బస్సులు ఆగకుండా వస్తున్నాయి. ఎలా దాటాలి?’
తాతయ్య సిగ్నల్ చూపిస్తూ ‘అదిగో, ఆ మూడు రంగుల లైట్లే మనకు దారి చూపిస్తాయి’ అన్నాడు.
రామ్ అడిగాడు.. ‘ఎరుపు వెలిగితే ఏంటి తాతయ్యా?’
‘ఎరుపు అంటే ఆగుము. వాహనాలు ఆగిపోతాయి. అప్పుడే మనం జీబ్రా క్రాసింగ్లో దాటాలి’ అన్నాడు తాతయ్య.
చుక్క వెంటనే ‘మరి పసుపు రంగు?’ అని అడిగింది.
‘పసుపు అంటే తయారుగా ఉండు. నడవడానికి రెడీ అవ్వు, కానీ ఇంకా దాటొద్దు’ అని చెప్పాడు.
స్వప్న ‘ఆకుపచ్చ వెలిగితే వాహనాలు వెళ్తాయి కదా? మనం ఆగాలి’ అంది.
తాతయ్య మెచ్చుకుంటూ ‘భలే చెప్పావు. నియమం పాటిస్తే ప్రమాదం ఉండదు. ఎప్పుడూ సిగ్నల్ చూసే దాటండి’ అని అందరినీ రోడ్డు దాటించాడు.
పిల్లలకి మాట :
రోడ్డు నిబంధనలు పాటించాలి.
సురక్షితంగా గమ్యాన్ని చేరాలి.
డాక్టర్ కోట లక్ష్మణ్,
ప్రభుత్వ ఉపాధ్యాయుడు, గ్రామం: కాకర్లపల్లి,
మంథని, జిల్లా: పెద్దపల్లి
సరైన ఆహారం, క్రమమైన వ్యాయామం, మంచి నిద్ర, సానుకూల ఆలోచనలు మనిషిని శారీరకంగా, మానసికంగా బలంగా ఉంచుతాయి. ఇలాంటి జీవనశైలి ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్కు సన్మార్గం వేస్తుంది. కానీ మత్తుపదార్థాల వైపు మొగ్గితే జీవితమే నాశనమవుతుంది. మత్తు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుందనిపించినా.. క్రమంగా ఆరోగ్యాన్ని, కుటుంబ సంబంధాలను, చదువును, కెరీర్ను నాశనం చేస్తుంది. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి కారణాలతో యువత మత్తుకు బానిసవుతున్నారు. ఒక్కసారి బానిసైతే బయటపడడం చాలా కష్టం. అందుకే ‘మత్తుకు నో.. జీవితానికి ఎస్’ అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలి. ఆరోగ్యమే నిజ మైన సంపద అని గ్రహించి, ప్రతి ఒక్కరూ ఆరో గ్యకరమైన జీవనాన్ని ఎంచుకోవాలి. అప్పుడే వ్యక్తిగతంగా, సామాజికంగా ఎదుగుతాం.
పేరు : బైరి అభినయ్, 10వ తరగతి,
సువిధ్య ఉన్నత పాఠశాల , కరీంనగర్
స్టాప్ డ్రగ్స్
కోనరావుపేట(వేములవాడ): మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ కోనరావుపేటలోని సన్రైజ్ తైక్వాండో క్లబ్ ఆధ్వర్యంలో గురువారం వినూత్న ప్రచారం చేశారు. కోచ్ మంగళగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డ్రగ్స్, మత్తుపదార్థాలతో కలిగే అనర్థాలపై డ్రాయింగ్ వేసి.. తైక్వాండో స్టైల్లో బాలికలు పోస్టర్ పట్టుకొని ప్రచారం చేశారు. ‘డ్రగ్స్ వద్దని చెప్పు.. యువత మేలుకో డ్రగ్స్ను వదులుకో.. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం.. భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దాం.. పొగ తాగుట హానికరం..’ వంటి అర్థాలు వచ్చేలా చిత్రాలు గీశారు.


