రెండు దశాబ్దాలుగా శిక్షణ ఇస్తున్నా
● డ్యాన్స్లో శిక్షణ తీసుకుంటున్న చిన్నారులు
● రాచర్లబొప్పాపూర్లో సందడిగా వేసవి శిక్షణ శిబిరం
● జానపదం, కోలాటం, క్లాసికల్ డ్యాన్స్లో ట్రెయినింగ్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): విద్యార్థినులు స్టెప్పు వేస్తే ఓ స్టైల్.. అడుగు వేస్తే ఓ రిథమ్... మొత్తానికి వేసవి శిక్షణ శిబిరాలు నృత్యశిక్షణతో కళకళలాడుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత 15 రోజులుగా కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరం చిన్నారులతో ఆకట్టుకుంటుంది. భువన ఆర్ట్స్ అకాడమీ డ్యాన్స్ మాస్టర్ పొందుర్తి ఉమేశ్ మార్గదర్శనంలో విద్యార్థినులు సెమీ క్లాసికల్, జానపదం, భక్తికోలాటం, జడకొప్పులు.. వెస్టర్న్ వంటి నృత్యాలు నేర్చుకుంటున్నారు.
సరదాగా సెలవులు
మండుతున్న వేసవిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నృత్య కళలో శిక్షణ పొందుతున్నారు. రాచర్లబొప్పాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న ట్రెయినింగ్ క్యాంపునకు విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. డ్యాన్స్ నేర్చుకోవడం ద్వారా ఏకాగ్రత పెంపొందడంతోపాటు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉచితంగా శిక్షణ ఇస్తుండడంతో దాదాపు 150 మంది విద్యార్థులు భారీగా హాజరవుతున్నారు. వేసవి సెలవులు ముగిసే వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది. ఇటీవల సిరిసిల్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతిభ చూపిన విద్యార్థులను కలెక్టర్ గరీమా అగ్రవాల్ ప్రశంసపత్రాలు అందించి, అభినందించారు. హ్యాండ్రైటింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, ఎంబ్రాయిడరీ, డ్యాన్స్ అంశాల్లో వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.
నేను దాదాపు 26 ఏళ్లుగా పిల్లలకు నృత్య శిక్షణ ఇస్తున్నా. భువన ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో డ్యాన్స్ నేర్పిస్తున్నాను. పిల్లలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాలాంటి కళాకారులకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తే మరింత మందిని కళాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం దక్కుతుంది.
– పొందుర్తి ఉమేశ్, భువన ఆర్ట్స్ అకాడమీ, డ్యాన్స్ మాస్టర్


