బుగ్గారం: బావిలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన బుగ్గారం మ ండలం చిన్నాపూర్లో చోటుచేసుకుంది. పోలీ సుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఒర్సు శ్రీనివాస్ గొర్లను మేపుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం తన రెండో కుమారుడు శివకుమార్ (11)ను పరుమాల మహేశ్తో కలిపి గొర్రెల వద్దకు పంపించాడు. రెండు గంటల సమయంలో మహేశ్ ఫోన్ చేసి శివ కుమార్ కనిపించడం లేదని శ్రీనివాస్కు సమాచారం అందించాడు. శ్రీనివాస్ వెళ్లి వెదుకుతుండగా.. వ్యవసాయ బావి లో బాలుడి చెప్పులు కనిపించాయి. గ్రామస్తుల సహాయంతో బావిలో వెదకగా శవం కనిపించింది. బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఉండవచ్చని మహేశ్ తెలిపాడు. తన కుమారుడి మృతిపై మహేశ్పై అనుమానం ఉందని శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్ తెలిపారు.
మానసిక వికలాంగుడి మృతి
జూలపల్లి: మండలంలోని తేలుకుంటలో ఓ మానసిక వికలాంగ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఎస్సై సనత్కుమార్ వివరా లు.. తేలుకుంటకు చెందిన పంగ లక్ష్మీరాజంకు ముగ్గురు పిల్లలు. చిన్నవాడైన పంగ సాయికృష్ణ(8) మానసిక వికలాంగుడు. గురువారం ఉదయం ఇంటి సమీపంలో గల బావి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. సాయంత్రం వరకు కొడుకు ఇంటికి రాక పోవడంతో తెలిసిన వారి ఇళ్లలో వాకబు చేసి, అనుమానంతో బావిలో కొక్కెంతో వెతకగా బాలుడి మృతదేహం దొరికింది. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


